కార్ల సర్వీసింగ్‌ కేంద్రంలో అగ్ని ప్రమాదం | Fire Accident In Car Servicing Centre Visakhapatnam | Sakshi
Sakshi News home page

కార్ల సర్వీసింగ్‌ కేంద్రంలో అగ్ని ప్రమాదం

Nov 9 2018 5:49 AM | Updated on Nov 10 2018 1:14 PM

Fire Accident In Car Servicing Centre Visakhapatnam - Sakshi

కారు ఇంజిన్‌ దగ్ధమైన దృశ్యం

విశాఖపట్నం, శఢఅక్కిరెడ్డిపాలెం (గాజువాక): ఆటోనగర్‌ బి – బ్లాక్‌లోని కార్ల సర్వీసింగ్‌ సెంటర్‌ లక్ష్మీ హుందాయ్‌ షోరూం అగ్నికి ఆహుతైంది. గురువారం రాత్రి జరిగిన ఈ ప్రమాదంలో షోరూంలో విడి భాగాలు (స్పేర్‌ పార్ట్స్‌) ఉండే క్యాబిన్‌ మొత్తం దగ్ధమైంది. కంపెనీలో స్పేర్‌ పార్టులు ఉన్న షెడ్డులో ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో పాటు కిందనున్న క్యాబిల్‌లో కూడా అగ్నికీలలు ఎగసిపడ్డాయి. అయితే కార్మికులు, సిబ్బంది అంతా సుమారు రాత్రి 7 గంటల సమయంలో విధులు ముగించుకుని కంపెనీ నుంచి వెళ్లిపోవడంతో అక్కడ సెక్యూరిటీ సిబ్బంది మాత్రమే ఉండడంతో పెను ప్రమాదం తప్పింది. అగ్నిమాపక సిబ్బందితో కలిసి కంపెనీ సిబ్బంది మంటలను పూర్తిగా అదుపు చేశారు. ప్రమాదం జరగడంలో విభిన్న వాదనలు వినిపిస్తున్నాయి.

సుమారు రాత్రి 7.30 గంటల సమయంలో షోరూం సెక్యూరిటీ చెపుతున్న వివరాల ప్రకారం షోరూం వెనుక నుంచి మంటలు ఒక్కసారిగా వ్యాపించాయని, వెంటనే ఫైర్‌ స్టేషన్‌కు, తమ యాజమాన్యానికి ఫోన్‌లో తెలిపానని చెబుతున్నారు. కొందరు మాత్రం షార్ట్‌సర్క్యూట్‌ అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న ఆటోనగర్, పెదగంట్యాడ అగ్నిమాపక వాహనాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. గాజువాక పోలీసులు కూడా సంఘటనా స్థలానికి వచ్చి పరిస్థితిని సమీక్షించి, వివరాలు సేకరించారు. ఈ రెండింటిలో ఏది నిజమో దర్యాప్తులో తేలాల్సి ఉందని జిల్లా అగ్నిమాపక అధికారి రాంప్రసాద్‌ పేర్కొన్నారు. 

ఆటోనగర్‌లోని లక్ష్మీ హుందాయ్‌ కంపెనీ పూర్తిగా కార్ల సర్వీసింగ్‌ సెంటర్‌. ఇక్కడ ఉన్న ఈ కంపెనీలో కార్లు తమ సర్వీసింగ్‌కు తీసుకువస్తుంటారు.అయితే కంపెనీ లోపలి భాగం అంతా రేకుల షెడ్డు మాత్రమే. పైన కార్లకు సంబంధించిన విడిభాగాలు, అందులో కొన్ని సింథటిక్, ఫోం వంటి వాటితో ఉంటాయని సిబ్బంది తెలిపారు. అయితే జరిగిన ప్రమాదం తీవ్రతను బట్టి ఇవి ఎలా అగ్నికి ఆహుతయ్యాయే తెలియాల్సి ఉంది.

యాజమాన్యం సిబ్బందిపై అగ్నిమాపక అధికారి ఆగ్రహం...
ఆటోనగర్‌తో పరిశ్రమలతో పాటు గాజువాక పరిధిలో పలు బహుళ అంతస్తుల భవనాల్లో అగ్నిప్రమాదం జరిగితే ఎటువంటి జాగ్రత్తలకు సంబంధించిన అనుమతులు లేవని విలేకరులు ప్రశ్నించగా జిల్లా అగ్నిమాపక అధికారికి విన్నవించగా ఆయన దీనిపై స్పందిస్తూ ఎక్కడ అనుమతుల విషయంలో ఉపేక్షించలేదని తెలిపారు. ప్రమాదం జరిగిన లక్ష్మీ హుందాయ్‌ కంపెనీకు నోటీసులు జారీ చేయనున్నట్లు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement