అల్లా కోసం కూతురి బలి

Father Sacrifices 4 Year Old Daughter Hoping For A Boy - Sakshi

సాక్షి, రాజస్తాన్‌: మూఢ నమ్మకాలతో మనుషుల్లో ఉన్నమతిపోతుంది. రంజాన్‌ మాసంలో కూతురిని బలిస్తే, తనకు కుమారుడు పుట్టేందుకు అల్లా తనను కరుణిస్తాడని భావించి ఓ వ్యక్తి తన కూతురిని ఘోరాతిఘోరంగా చంపాడు. కసాయివాడు జంతువు గొంతు కోసినట్లు కూతురి గొంతు కోసి చంపాడు. ఈ దారుణమైన సంఘటన రాజస్తాన్‌లోని జోధ్‌పూర్‌లో శుక్రవారం వేకువజామున జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. జోథ్‌పూర్‌ నగరంలో నవాబ్‌ అలీ ఖురేషీ, ఆయన భార్య, కూతురు రిజ్వానాలు, అలీ భార్య తరపు బంధువుల ఇంట్లో కొంతకాలంగా నివాసం ఉంటున్నారు. నవాబ్‌ అలీ పై అంతస్తులో ఉంటుండగా..భార్య తరపు బంధువులు కింద పోర్షన్‌లో ఉంటున్నారు.

నవాబ్‌ అలీ ఖురేషీకి నాలుగేళ్ల రిజ్వాన్‌ అనే కూతురు ఉంది. శుక్రవారం వేకువజామున రెండున్నర గంటల సమయంలో అలీ తన స్వహస్తాలతో కూతురిని గొంతు కోసి బలి ఇచ్చి, అల్లాకు కానుకగా సమర్పించాడు. అనంతరం తాను ఏమీ ఎరగనట్లు వచ్చి భార్య పక్కన పడుకున్నాడు.  కూతురు రిజ్వానా కనపడకపోవడంతో తల్లి కిందకు వెళ్లి చూసింది. రక్తపుమడుగులో పడి ఉండటం చూసి హతాశురాలైంది. అలీ భార్య కేకలు విని బంధువులు బయటకు వచ్చారు. జరిగిన విషయం తెలుసుకుని పోలీసులకు సమాచారం అందించారు. సుమారు 3 గంటలకు సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.

ఆధారాలు సేకరించేందుకు డాగ్‌ స్క్వాడ్‌ను హుటాహుటిన రప్పించిన పోలీసులు ఇళ్లంతా పరిశీలించారు. కుటుంబసభ్యులందరినీ శుక్రవారం, శనివారం అంతా పోలీసులు విచారించారు. విచారణలో కన్న తండ్రే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు తేల్చారు. అల్లా కోసమే కూతురిని బలిచ్చానని విచారణలో నవాబ్‌ అలీ ఒప్పుకున్నాడు. చిన్నారి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పిపడ్‌ నగర ఆసుపత్రికి తరలించారు.  మూర్ఖపు తండ్రిపై పోలీసులు కేసు నమోదు చేసి జైలుకు తరలించారు. ఈ మేరకు దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top