బాత్‌రూమ్‌లో శవమై కనిపించిన ప్యాషన్‌ డిజైనర్‌

A Fashion Designer Found Dead In Her Flat In Mumbai - Sakshi

ముంబై: ప్యాషన్‌ డిజైనర్‌గా పనిచేస్తున్న సునీత సింగ్‌ తను నివాసం ఉంటున్న ప్లాట్‌లోనే అనుమానస్పద స్థితిలో మరణించారు. వివరాల్లోకి వెళ్తే ముంబైలోని లోఖండ్వాలాలో తన కొడుకు లక్ష్య, అతనికి కాబోయే భార్య అషుప్రియ బెనర్జీలతో కలిసి సునీత నివాసం ఉంటున్నారు. కాగా, గురువారం ఉదయం ఆమె బాత్‌రూమ్‌లో  శవమై కనిపించారు. స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్‌ నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అలాగే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

‘గురువారం ఉదయం అమ్మ బాత్‌రూమ్‌లోకి వెళ్లింది. ఆ తర్వాత కొంత సేపటికి నేను పలిచిన ఆమె నుంచి స్పందన రాలేదు. దీంతో నేను బాత్‌రూమ్‌ డోర్‌ను బలవంతంగా ఓపెన్‌ చేశాను. అప్పటికే ఆమె కిందపడిపోయి ఉంది.. ఫ్లోర్‌పై రక్తపు మరకలు కూడా ఉన్నాయి. దీంతో నేను ఆందోళనకు గురయ్యాను. గుడికి వెళ్లి, అక్కడి నుంచి తెలిసిన ఆభరణాల వ్యాపారి వద్దకు వెళ్లి విషయం చెప్పాను. అతడు పోలీసులకు ఈ విషయం చెప్పమని సూచించాడు. ఆ తర్వాత ఓ ప్రైవేటు అంబులెన్స్‌కు ఫోన్‌ చేశాను. అంతేకాకుండా ఢిల్లీలోని బంధువులకు ఈ విషయం తెలిపాను. నేను తిరిగి వచ్చేలోపే పోలీసులు అక్కడికి చేరుకున్నార’ని సునీత కొడుకు పోలీసులకు తెలిపాడు.

ఈ ఘటనపై ఓ  సీనియర్‌ పోలీస్‌ అధికారి మాట్లాడుతూ..  ఈ కేసును అనుమానస్పద మృతిగా నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టామని తెలిపారు. ప్రస్తుతం లక్ష్య, అశుప్రియలను విచారిస్తున్నామని.. లక్ష్య కలిసిన ఆభరణాల వ్యాపారితో పాటు, ప్రైవేటు అంబులెన్స్‌ను తీసుకొచ్చినవారిని కూడా విచారిస్తామని పేర్కొన్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం ఆమె తలకు గాయం కావడం వల్ల మృతిచెందినట్టుగా తెలుస్తోందన్నారు.  ఆమె ముఖంపై కూడా చిన్న చిన్న గాయాలు ఉన్నట్టు వెల్లడించారు. పోస్ట్‌మార్టమ్‌ నివేదిక వస్తేగానీ ఆమె ఎలా మృతి చెందిందో చెప్పాలేమని ఆయన తెలియజేశారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top