బండరాయితో మోది వృద్ధుడి హత్య

Elderly Man Stoned To Death In Sangareddy - Sakshi

పుల్‌కల్‌(అందోల్‌) : గుర్తు తెలియని వ్యక్తులు 70సంవత్సరాల వృద్ధుడిని బండరాయితో మోది హత్య చేసిన సంఘటన మండల పరిధిలోని చౌటకూర్‌ శివారులో శనివారం తెల్లావారుజామున చోటుచేసుకుంది. మృతుడిని సెల్‌ఫోన్‌ ఆధారంగా గుర్తించారు. ఇందుకు సంబధించిన వివరాలు ఇలా ఉన్నాయి. అందోల్‌ మండలం నేరడిగుంట గ్రామానికి చెందిన ఒగ్గు భాగయ్య(70) ఇంట్లో నుంచి గత బుధవారం ఆస్పత్రికి వెళుతున్నానని చెప్పి వెళ్లాడని కుటుంబ సభ్యులు తెలిపారు. కాని శుక్రవారం వరకు ఎక్కడికి వెళ్లింది.. ఎవరి వద్ద ఉన్నది తెలియలేదన్నారు.

శుక్రవారం రాత్రి పుల్‌కల్‌ ఎస్‌ఐ ప్రసాద్‌రావు చౌటకూర్‌ శివారులో భాగయ్య మృతిచెంది ఉన్నాడని సమాచారం ఇవ్వగా తాము వెళ్లి చేశామన్నారు. ఇదిలా ఉంటే గుర్తుతెలియని వ్యక్తులు జోగిపేట నుంచి నమ్మించి చౌటకూర్‌ శివారులోకి తీసుకొచ్చినట్లుగా తెలుస్తుంది. కోన్నాల–చౌటకూర్‌ శివారు మధ్య గల డప్పు మొగులయ్య వ్యవసాయ పోలం వద్ద భాగయ్యను బండరాయితో మోది హత్య చేసినట్లుగా ఎస్‌ఐ ప్రసాద్‌రావు తెలిపారు.

సంఘటన స్థలంలో రెండు బిర్యాని ప్యాకేట్లు, ఒక బాండ్‌ పెపర్, సెల్‌ఫోన్‌ లభించింది. దీన్నిబట్టి భాగయ్యను తెలిసిన వారే అక్కడికి తీసుకొచ్చి హత్య చేసినట్లుగా పోలీసులు అనుమానం వ్యక్తంచేస్తున్నారు. శుక్రవారం అర్థరాత్రి వెలుగు చూసిన ఈ సంఘటనను సంగారెడ్డి డీఎస్పీ శ్రీనివాస్‌రావు, జోగిపేట సీఐ తిరుపతిరాజులు సందిర్శించారు. క్లూస్‌ టీం, డాగ్‌ స్క్వాడ్‌తో ఆధారాలు సేకరించిన ఎలాంటి ఆచూకి లభించలేదు. ఈ మేరకు మృతదేహాన్ని జోగిపేట ఆస్పత్రికి తరలించారు. కేసునమోదు చేసుకొని విచారణ చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top