కర్ణాటక మంత్రిపై సీబీఐ కేసు
న్యూఢిల్లీ: కర్ణాటకకు చెందిన డిప్యూటీ ఎస్పీ ఎంకే గణపతి అనుమానాస్పద మృతి కేసులో ఆ రాష్ట్ర మంత్రి కేజే జార్జ్, మరో ఇద్దరు మాజీ పోలీసు అధికారులను సీబీఐ ఎఫ్ఐఆర్లో నిందితులుగా చేర్చింది. గణపతి గతేడాది జూలై 7న చనిపోయారు.
జార్జ్, మాజీ ఐజీపీ (లోకాయుక్త) ప్రణవ్ మొహంతీ, మాజీ అదనపు డీజీపీ ఏఎం ప్రసాద్లు తనను వేధిస్తున్నారనీ, తనకేమైనా జరిగితే అందుకు వారిదే బాధ్యతని మరణించడానికి ముందు గణపతి చెబుతుండేవారు. అనుమానాస్పద పరిస్థితుల్లో గణపతి మృతి చెందిన అనంతరం ఈ కేసును సీబీఐతో విచారణ జరిపించాలని ఆయన తండ్రి హైకోర్టును ఆశ్రయించగా కోర్టు తిరస్కరించింది. దీనిని సవాల్ చేస్తూ గణపతి తండ్రి సుప్రీంకోర్టుకు వెళ్లడంతో కేసు సీబీఐకి బదిలీ అయ్యింది. తాజాగా సీబీఐ తన ఎఫ్ఐఆర్లో జార్జ్తోపాటు అధికారులపై అభియోగాలు నమోదు చేసింది.