దారి కోసం నరుక్కున్న అన్నదమ్ములు
ముగ్గురికి తీవ్రగాయాలు
పశ్చిమగోదావరి, పెరవలి: పొలం వద్ద దారి కోసం సొంత అన్నదమ్ములు నరుక్కున్న ఘటన ఇది. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. పెరవలి ఎస్సై వి.జగదీశ్వరరావు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఖండవల్లి గ్రామానికి చెందిన కొవ్వూరి శేషయ్యకు నలుగురు కుమారులు. వీరిలో కొవ్వూరు ధర్మయ్య, కొవ్వూరు నాగేశ్వరరావు, కొవ్వూరు ముసలయ్యకు పంట చేను ఉంది. వీరిలో కొవ్వూరి ధర్మయ్య తన చేను నుంచి వెళ్లటానికి వీలులేదని గత కొంత కాలంగా గొడవలు పడుతున్నారు.
ఈ తగువులు జరుగుతుండగానే శుక్రవారం కొవ్వూరు నాగేశ్వరరావు ఆయన కుమారుడు మార్కండేయులు, మరో తమ్ముడు కొవ్వూరి ముసలయ్యలు కలసి ఎండు గడ్డిని తీసుకువచ్చి మేటు వేద్దామని దింపారు. గడ్డిని మోస్తుండగా కొవ్వూరి ధర్మయ్య, వారి కుమారులు బార్గవ, శేఘ వచ్చి ఇలా పట్టుకెళ్లటానికి కుదరదని చెప్పటం ఘర్షణకు కారణమైంది. మాటామాటా పెరిగి తొలుత కర్రలతో దాడులు చేసుకున్నారు. ఆ తర్వాత ధర్మయ్య, ఆయన కుమారులు కత్తులతో దాడి చేయటంతో నాగేశ్వరరావు, ముసలయ్య, మార్కండేయులకు తీవ్రగాయాలయ్యాయని తెలిపారు. దీంతో క్షతగాత్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి వైద్యం నిమిత్తం తణుకు ప్రభుత్వాసుపత్రికి తరలించామన్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.