మద్యంలో విషం కలిపి తాగిన తమ్ముడు
తెలియక అదే మద్యాన్ని సేవించి మృతి చెందిన అన్న
సాక్షి, చెన్నై: ప్రియురాలు దూరమైందన్న మనోవేదనతో మద్యంలో విషం కలిపి తాగడంతో తమ్ముడు మరణించగా..అందులో విషం ఉందన్న సమాచారం తెలియక దాన్ని సేవించి అన్న మృతి చెందాడు. ఈ ఘటన తమిళనాడులోని తూత్తుకుడి మణినగర్ పుదూర్లో ఆదివారం జరిగింది. సాత్తాన్ కుళం సమీపంలోని మణినగర్ పుదూర్కు చెందిన రాజా, విజయ్ అన్నదమ్ముళ్లు. రాజాకు ఐదు నెలల క్రితం వివాహమైంది. చెన్నైలోని ఓ సంస్థలో పనిచేస్తున్న విజయ్కు ఓ యువతితో పరిచయం ఏర్పడి అదికాస్త ప్రేమగా మారింది.
ఈ క్రమంలో యువతి దూరం కావడంతో విజయ్ మనోవేదనకు గురయ్యాడు. ప్రియురాలు దూరమవ్వడం, తన ప్రేమ విఫలమవడంతో వేదనలో పడ్డ విజయ్ ఆత్మహత్య చేసుకుందామని అనుకున్నాడు. మద్యం బాటిల్ తీసుకువచ్చి అందులో విషం కలిపి దాన్ని సేవించి స్పృహ తప్పాడు. ఆ సమయంలో ఇంటికి వచ్చిన రాజా అందులో విషం ఉందన్న సమాచారం తెలియక అక్కడ మిగిలి ఉన్న మద్యాన్ని సేవించాడు. కాసేపటికి నోట్లో నుంచి నురగలు రావడంతో ఆందోళన చెంది కేకలు పెట్టాడు. ఇరుగుపొరుగువారు అన్నదమ్ములను ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఇద్దరు మృతిచెందారు.
సంబంధిత వార్తలు