సోదరుడు ఫోన్‌ లాక్కున్నాడని..

Brother taken cellphone forcefully.. - Sakshi

మనస్తాపంతో ఇంటర్‌ విద్యార్థిని ఆత్మహత్య

పరిగి: సోదరుడు ఫోన్‌ లాక్కున్నాడని మనస్తాపానికి గురైన ఓ ఇంటర్‌ విద్యార్థిని ఒంటికి నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడింది. వికారాబాద్‌ జిల్లా పరిగి మండల పరిధిలోని ఖుదావంద్‌పూర్‌లో మంగళవారం మధ్యాహ్నం ఈ ఘటన చోటు చేసుకుంది. మృతురాలి కుటుంబీకుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన నసీర్‌ కూతురు నౌసిన్‌బేగం(17) పరిగిలోని విజ్ఞాన్‌ జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ రెండో ఏడాది చదువుతోంది. ప్రస్తుతం దోమ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో వార్షిక పరీక్షలు రాస్తుంది. బుధవారం పరీక్షకు హాజరు కావాల్సి ఉంది.

అయితే, మంగళవారం ఆమె ఇంట్లో  చదువుకుంటుంది. ఈక్రమంలో నౌసిన్‌బేగం తన అన్న ఫోన్‌ తీసుకుని స్నేహితురాలితో మాట్లాడింది. విషయం గమనించిన ఆయన ‘తెల్లారితే పరీక్ష పెట్టుకుని ఫోన్‌తో ఆటలేంట’ని మందలించి నౌసిన్‌బేగం నుంచి ఫోన్‌ లాక్కుని బయటకు వెళ్లిపోయాడు. మృదుస్వభావి అయిన ఆమె మనస్తాపానికి గురై ఇంట్లో ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని నిప్పంటించుకుంది.

గమనించిన కుటుంబీకులు స్థానికుల సాయంతో మంటలు ఆర్పి వెంటనే పరిగి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. 80 శాతం శరీరం కాలిపోయిందని వైద్యులు తెలిపారు. ప్రథమ చికిత్స నిర్వహించి ఉస్మానియాకు రెఫర్‌ చేశారు.  చావుబతుకులతో కొట్టుమిట్టాడుతున్న నౌసిన్‌బేగం నుంచి న్యాయమూర్తి భారతి వాగ్మూలం సేకరించారు. అనంతరం ఉస్మానియా ఆస్పత్రికి తరలిస్తుండగా విద్యార్థిని మార్గంమధలో మృతి చెందింది. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు అందలేదు.

 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top