మూడవ కాన్పులో కూడా కూతురు పుట్టిందని..

Baby Girl Killed By Mother In West Delhi - Sakshi

న్యూఢిల్లీ : మూడవ కాన్పులో కూడా కూతురు పుట్టిందన్న కోపంతో పసిబిడ్డను ఊపిరి ఆడకుండా చేసి చంపిందో తల్లి. ఈ సంఘటన పశ్చిమ ఢిల్లీలో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఢిల్లీకి చెందిన అశార్ఫి మహతో, రీతా దేవి దంపతులకు ఇద్దరు సంతానం. ఇద్దరు కూడా ఆడపిల్లలు కావటంతో మూడో కాన్పులోనైనా మగబిడ్డ కావాలని భర్త మహతో పట్టుబట్టాడని రీతా దేవి ఆరోపించింది. గర్భవతిగా ఉన్న రీతా దేవి ఈ ఆదివారం ఢిల్లీలోని ఓ ఆస్పత్రిలో ఆడబిడ్డకు జన్మనిచ్చింది. మూడోసారి కూడా ఆడబిడ్డ పుట్టిందన్న కోపంతో కొద్దిసేపటి తర్వాత శిశువును ఊపిరి ఆడకుండా చేసి చంపేసింది.

ఆ తర్వాత పాప కదలటం లేదని డాక్టర్లకు ఫిర్యాదు చేసింది. శిశువును పరీక్షగా చూసిన డాక్టర్లకు ముక్కుపై, పెదాలపై నల్లటి మచ్చలు కనిపించాయి. దీంతో ఇది ఖచ్చితంగా హత్యేనని భావించిన వారు పోలీసులకు సమాచారమిచ్చారు. ఆస్పత్రికి చేరుకున్న పోలీసులు రీతా దేవిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. మొదట హత్య చేయలేదని వాదించిన ఆమె కొద్దిసేపటికి నేరాన్ని అంగీకరించింది. మూడవసారి ఆడబిడ్డ పుట్టిందనే కోపంతో చంపేసినట్లు ఒప్పుకుంది. ఈ హత్యకు ఆమె భర్త మహతోకు ఎటువంటి సంబంధం లేదని పోలీసులు తేల్చారు. అయితే తాను మగబిడ్డ కావాలని భార్యను ఎప్పుడూ అడగలేదని మహతో అనటం గమనార్హం. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top