వెట్టి చాకిరి కేసులో 17 ఏళ్ల జైలు

Accused has been sentenced to 17 years in prison and fined in harassment - Sakshi

యాకుత్‌పురా: బాలలతో వెట్టి చాకిరి చేయించిన కేసులో బిహార్‌కు చెందిన నిందితుడికి 17 ఏళ్ల జైలు శిక్ష, రూ.6 వేల జరిమానా విధిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. నాంపల్లిలోని 4వ అదనపు మెట్రోపాలిటన్‌ సెషన్స్‌ జడ్జి డి.హేమంత్‌ కుమార్‌ బుధవారం ఈ మేరకు తీర్పునిచ్చారు. భవానీ నగర్‌ ఇన్‌స్పెక్టర్‌ వెంకటేశ్వర్లు కథనం మేరకు.. బిహార్‌కు చెందిన షంషీర్‌ ఖాన్‌ (38) బతుకు దెరువు కోసం నగరానికి వచ్చి నషేమాన్‌నగర్‌ ఒవైసీ పాఠశాల ప్రాంతంలో గాజుల తయారీ కార్ఖానా నిర్వహిస్తున్నాడు.

బిహార్‌కు చెందిన మైనర్‌ బాలలను నగరానికి తీసుకొచ్చి తన కార్ఖానా లో పనిచేయించాడు. 2016 జనవరి 2న అప్పటి భవానీ నగర్‌ ఎస్‌ఐ ప్రసాద్‌రావు, కార్మిక శాఖ అధికారులతో కలిసి దాడులు నిర్వహించారు. దాడుల్లో గాజుల కార్ఖానాలో 11 మంది మైనర్‌ బాలలు పనిచేస్తున్నట్లు గుర్తించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్‌ చేసి జైలుకు తరలించారు. అప్పటినుంచి కోర్టులో కొనసాగుతున్న కేసుపై ఈ మేరకు తీర్పు వెలువడింది. దీంతో నిందితుడిని జైలుకు తరలించారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top