
విశ్లేషణ
ఇప్పటికీ వెట్టి చాకిరీ వలలో చిక్కుకు పోయిన బాల కార్మికులు లక్షలాది మంది ఉన్నారు. పొలాల్లో, ఫ్యాక్టరీల్లో, ఇళ్ళలో పని చేస్తున్న నిస్సహాయ బాలల ఆర్తనాదాలు నా చెవుల్లో గింగురుమంటున్నాయి. అటువంటి పరిస్థితుల నుంచి రక్షించిన వందలాది మంది బాలలు 1998లో నా చుట్టూ అల్లు కున్న సంగతి గుర్తుకొస్తోంది. బాల కార్మిక వ్యవస్థకు వ్యతిరేకంగా 103 దేశాలను చుట్టి వచ్చిన గ్లోబల్ మార్చ్లో నా వెంట వచ్చిన బాలలు నిర్భయంగా చేసిన నినాదాలు కూడా గుర్తున్నాయి.
యాత్ర ముగింపులో జెనీవా లోని అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్ఓ) ప్రధాన కార్యాలయంలో ప్రసంగించవలసిందిగా మమ్మల్ని కోరారు. అక్కడ మేం తక్షణం అమలుపరచవలసిన సరళమైన డిమాండును వినిపించాం: ‘‘చిట్టి చేతుల్లో ఇక ఎంతమాత్రం పనిముట్లు ఉండకూడదు. మాకు పుస్త కాలు, బొమ్మలు కావాలి!’’
నెరవేరని లక్ష్యం
ఆ యాత్ర చరిత్ర సృష్టించింది. ఫలితంగా, ఐఎల్ఓ 1999లో (182వ) తీర్మానాన్ని ఆమోదించింది. అది బానిసత్వం, మానవ అక్రమ రవాణా, వెట్టి చాకిరీకి వ్యతిరేకంగా వచ్చిన మొదటి అంతర్జా తీయ చట్టం. ఆ తీర్మానాన్ని ఆమోదించిన మొదటి 16 ఏళ్ళలో గణనీయమైన ప్రగతి కనిపించడంతో ఎన్నో ఆశలు చిగురించాయి.
బాల కార్మికుల సంఖ్య 2000–2016 సంవత్సరాల మధ్యలో గణనీయంగా 25 కోట్ల నుంచి 15 కోట్ల 20 లక్షలకు తగ్గింది. దాంతో మార్పు తేగలం అనిపించింది. కానీ, అది సరిపోదు. బాలల విష యంలో ప్రతి క్షణమూ విలువైనదే. స్కూలుకు వెళ్ళలేకపోయిన ప్రతి రోజూ ఒక అవకాశాన్ని కోల్పోయినట్లే లెక్క. ఒక్క నిమిషం బాని సత్వంలో మగ్గినా బాల్యాన్ని కోల్పోయినట్లే లెక్క.
ఐరాస 2016లో సతత వికాస లక్ష్యా (ఎస్.డి.జి.)లను నిర్దేశించుకున్నపుడు ఉద్యమాన్ని పునర్జీవింపజేసే అవకాశం వచ్చింది. బాల కార్మికుల నిర్మూలనను ఒక ఎస్.డి.జి.గా చేర్చేట్లు చూసేందుకు మేం ఉద్యమాన్ని చేపట్టాం. అంతర్జాతీయ అభివృద్ధి అజెండాలో ఈ అంశాన్ని కూడా చేర్చితే ఎంతో ఊతం లభిస్తుందని భావించాం. మా కృషి ఫలించింది. ప్రపంచం 2025 కల్లా బాల కార్మిక వ్యవస్థ ఏ రూపంలోనూ లేకుండా చూస్తామని వాగ్దానం చేసింది.
గ్లోబల్ మార్చ్లో పాల్గొన్నవారిలో పిన్న వయస్కుడు బసు రాయ్. ఆ ఎనిమిదేళ్ళ పిల్లాడిని నా భుజాల మీదకు ఎక్కించుకుని నడిచాను. వాడిది కంచు కంఠం. ‘‘బాల కార్మికులను ఎవరు నిరో ధిస్తారు? మేమే’’ అని నినదించేవాడు. మనం పెట్టుకున్న 2025 గడువు ఇంక కొద్ది నెలల్లో ముగుస్తుందనగా, బసు లాంటి లక్షలాది మంది నుంచి అదే రకమైన గొంతు ఇప్పటికీ వినిపిస్తోందని బరువెక్కిన హృదయంతో చెప్పాల్సి వస్తోంది.
ఎస్.డి.జి.లు చేపట్టిన మొదటి నాలుగేళ్ళలో, 2020 వరకు బాల కార్మికుల సంఖ్య 16 కోట్లకు పెరిగింది. అప్పటికి 20 ఏళ్ళలో బాల కార్మికుల సంఖ్య పెరగడం అదే మొదటిసారి. ఒక్క ఆఫ్రికాలోనే రోజూ 10,000 మంది బాలలు బలవంతపు చాకిరీలోకి దిగు తున్నారు. అదే కాలంలో, ప్రపంచం 10 ట్రిలియన్ డాలర్లకు సంప దను పెంచుకుంది. మరో రకంగా చెప్పాలంటే, కనీసం వారానికొక కోటీశ్వరుడు తయారయ్యాడు.
ఇది దయారాహిత్యానికి సంకేతం. దీన్ని నిజంగా మనం అభివృద్ధి అనగలమా? కొన్నేళ్ళ క్రితం నేను ఐరాసలో మాట్లాడుతూ, 2025 నాటికి ప్రపంచంలో బాల కార్మికులు లేకుండా చూడగలమని చెప్పాను. కానీ, ‘‘అయ్యా! బాల కార్మిక వ్యవస్థకు అంతం ఎన్నడు?’’ అని ఈ మధ్య ఎవరో నన్ను అడిగి నపుడు నాకు ఏం జవాబు చెప్పాలో తోచలేదు.
అది హక్కుల సమస్య
బాల కార్మికులు లేకుండా చేసే ఉద్యమాన్ని ప్రభావవంతంగా ఎలా మలచాలనే విషయంలో 2016కు ముందు మనం కొన్ని విలు వైన పాఠాలు నేర్చుకున్నాం. ప్రజా ఉద్యమ స్ఫూర్తి, రాజకీయ సంకల్ప బలంతో కూడిన నైతిక నాయకత్వం ప్రగతిని సాధించేందుకు తోడ్పడ్డాయి. చాలా దేశాలు విద్యా రంగంపై భారీగా పెట్టుబ డులు పెట్టాయి.
నిర్బంధ విద్యను ప్రాథమిక హక్కుగా గుర్తించిన బ్రెజిల్, భారత్, కెన్యా, దక్షిణాఫ్రికా సత్ఫలితాలు చూశాయి. ఎక్కడి నుంచి కూడా బాల కార్మికులు వ్యవస్థలోకి రాకుండా చూడాలని రాజ కీయంగా బలమైన వాణి (ముఖ్యంగా యూరప్, అమెరికా నుంచి) వినిపించడంతో పరిశ్రమలు కూడా తలొగ్గక తప్పలేదు.
నేడు ప్రపంచ వ్యాప్తంగా ఆ రకమైన ఉద్యమ స్ఫూర్తి కొరవడింది. మనం కూడా బాల కార్మికులను ఒక ఉప అంశంగా చూడటం మొదలెట్టాం. దాన్నొక కార్మిక సమస్యగా పరిగణిస్తున్నాం తప్పించి న్యాయాన్ని, మానవ హక్కులను కాలరాస్తున్న సంక్షోభంగా చూడటం లేదు. లోతైన సమస్యలు మరికొన్ని ఉన్నాయి. అనేక పేద దేశాలు (ముఖ్యంగా ఆఫ్రికాలోనివి) అసమంజస పన్నుల వ్యవస్థల్లో, కునారి ల్లజేస్తున్న అప్పుల ఊబిలో, అవినీతి, అవకతవకల పాలనలో, వివిధ వర్గాల మధ్య ఘర్షణల్లో చిక్కుకుపోయాయి.
దాంతో ఈ సంక్షోభం తీవ్రరూపం దాల్చింది. మరో ప్రమాదకరమైన ధోరణిని గమనించాను. అమెరికాలో 30కి పైగా రాష్ట్రాలు బాల కార్మికుల సంరక్షణ చట్టాలను నిర్వీర్యం చేస్తూ కొత్త సవరణలు తీసుకొచ్చాయి. సభ్యులుగా ఉన్న దేశాల నుంచి నిరసన ఎదురవడంతో, బాల కార్మి కులకు కంపెనీలను బాధ్యులను చేసే చట్టాన్ని యూరోపియన్ యూనియన్ సడలింపజేసింది. బ్రెజిల్లోనూ ఆ దిశగా చర్చలు సాగుతున్నాయి.
మన పిల్లలు అనుకుంటేనే!
అయితే, చిన్నవే అయినా, కొన్ని అర్థవంతమైన చర్యలూ కని పించకపోలేదు. ‘యునిసెఫ్’ ఇటీవల ప్రపంచ బాలల సంరక్షక నిధిని ఏర్పాటు చేసింది. కానీ, ఆ సాయం సరిపోదు. లక్ష్యంలో సుమారు 30 శాతాన్నే ఆ నిధి అందుకోగలిగింది. ప్రపంచ దేశాలు కూడా మునుపెన్నడూ లేనంత ఘర్షణలను చూస్తున్నాయి. యుద్ధ మండలాల్లో జీవిస్తున్న బాలల శాతం 1990ల నుంచి రెండింతలైంది.
నేనిది రాస్తున్న సమయానికి 47 కోట్ల 30 లక్షల మంది బాలలు ఘర్షణలు సాగుతున్న చోట్ల నలిగిపోతున్నారు. వాతావరణ సంక్షోభం బడుగు వర్గాలపై ప్రభావం చూపుతోంది. ఇది బాల కార్మి కుల సంఖ్యను పెంచుతూ, పేదరిక, అన్యాయాల వలయాన్ని కొనసాగిస్తోంది. చాలా దేశాలు బాల కార్మికుల సంఖ్యను తగ్గించు కోగలగడం ఒక్కటే ఆశలు మోడువారకుండా చూస్తోంది. బాల కార్మి కులకు వ్యతిరేకంగా ప్రజా గొంతుకలు వినిపిస్తూనే ఉన్నాయి.
ఈ ఉద్యమానికి నాయకత్వం వహించగల సత్తా భారత్కు ఉంది. మనకు పటిష్ఠమైన చట్టాలు, చక్కని సంక్షేమ పథకాలు, రాజ కీయంగా ఏకాభిప్రాయం ఉన్నాయి. పరిశ్రమల నుంచి కూడా ప్రతి ఘటన నామమాత్రంగానే ఉంది. అన్నీ అనువైన పరిస్థితులున్నాయి. కనుక, సత్వర కార్యాచరణకు నడుం బిగించాలి. మొదట చట్టాలను అమలుపరచాలి. కాగితాలకు మాత్రమే పరిమితమైన చట్టాల వల్ల ఉపయోగం లేదు.
బాల కార్మికులను వివిధ (విద్య, ఆరోగ్యం, పేదరికం) రంగాలతో ముడిపడిన సమస్యగా చూడాలి. అలాగే, విద్యా రంగంలో పెట్టుబడులు కీలకం. ప్రమాణాలతో కూడిన పాఠ శాల విద్య బాల కార్మికులను చాకిరీ నుంచి విముక్తులను చేయ గలదు. అన్నింటికన్నా ముఖ్యంగా బాల కార్మికులుగా పని చేస్తున్న వారందరూ మన పిల్లలేననే భావన అంకురించాలి. అప్పుడే సమస్య పరిష్కారానికి త్వరపడగలుగుతాం. బాలలకు మెరుగైన ప్రపంచాన్ని అందించాల్సిన బాధ్యత మనపై ఉంది.
కైలాశ్ సత్యార్థి
వ్యాసకర్త నోబెల్ శాంతి బహుమతి గ్రహీత, సామాజిక కార్యకర్త (‘హిందుస్థాన్ టైమ్స్ సౌజన్యంతో)