200 కోట్లతో జీనోమ్‌ల్యాబ్స్‌ ప్లాంట్లు | zeenom labs Plants With 200 Crore Investment | Sakshi
Sakshi News home page

200 కోట్లతో జీనోమ్‌ల్యాబ్స్‌ ప్లాంట్లు

Aug 5 2019 12:23 PM | Updated on Aug 5 2019 12:23 PM

zeenom labs Plants With 200 Crore Investment - Sakshi

కొత్త ఉత్పత్తులతో అశోక్‌ కుమార్, నాగరాజు (కుడి)

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: న్యూట్రాస్యూటికల్స్‌ తయారీలో ఉన్న హైదరాబాద్‌ కంపెనీ జీనోమ్‌ల్యాబ్స్‌ రెండు ప్లాంట్లను నెలకొల్పుతోంది. భాగ్యనగరి సమీపంలోని జీనోమ్‌వ్యాలీలో 9 ఎకరాల విస్తీర్ణంలో తయారీ కేంద్రం ఏడాదిలో సిద్ధం కానుంది. ఇక్కడే కంపెనీకి ఆర్‌అండ్‌డీ సెంటర్‌ ఉంది. వైజాగ్‌ వద్ద ఆంధ్రప్రదేశ్‌ మెడ్‌టెక్‌ జోన్ లో మూడు ఎకరాల్లో వచ్చే ఏడాదికల్లా ప్లాంటు పూర్తి కానుంది. ఇప్పటికే రూ.50 కోట్లు వెచ్చించామని జీనోమ్‌ల్యాబ్స్‌ బయో సీఎండీ పి.నాగరాజు వెల్లడించారు. కంపెనీ రూపొందించిన పలు ఉత్పత్తులను విడుదల చేసిన సందర్భంగా సంస్థ ఈడీ అశోక్‌ కుమార్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. తయారీ కేంద్రాలకు మొత్తం రూ.200 కోట్ల సొంత నిధులను ఖర్చు చేస్తామన్నారు. ప్రస్తుతం థర్డ్‌ పార్టీ ప్లాంట్లలో ఉత్పత్తుల తయారీ చేపట్టామని చెప్పారు. దేశవ్యాప్తంగా వెల్‌నెస్‌ కేంద్రాల ఏర్పాటుకు ప్రణాళిక రూపొందించామని ఆయన పేర్కొన్నారు.

వందకుపైగా విభిన్న ఉత్పత్తులు..
జీనోమ్‌ల్యాబ్స్‌ 2015లో ఏర్పాటైంది. నాలుగేళ్ల పరిశోధన అనంతరం సహజసిద్ధ వనమూలికలతో ప్రొడక్టులను తయారు చేసింది. సూపర్‌ మార్కెట్లతోపాటు కంపెనీకి చెందిన ఫిట్‌డే.ఇన్  ద్వారా ఇవి లభిస్తాయి. కొరియాకు చెందిన ఇల్వా కంపెనీ సహకారంతో రూపొందించిన జిన్ సెంగ్‌ ఆధారిత ఉత్పత్తులు వీటిలో ఉన్నాయి. మార్కెట్లో ఉన్న జిన్ సెంగ్‌ ప్రొడక్టులతో పోలిస్తే ఇది 15 రెట్లు మెరుగ్గా పనిచేస్తుందని కంపెనీ తెలిపింది. రోగ నిరోధక శక్తి పెంచే అశ్వగంధ, జిన్ సెంగ్, జింకో బిలోబా, ఎల్‌–ఆర్జినైన్‌తో గ్రీన్  టీ, క్యాప్యూల్స్, చూయింగ్‌ గమ్స్‌ను సూపర్‌ హెర్బ్‌ పేరుతో విడుదల చేసింది. సూపర్‌ డైట్‌ శ్రేణిలో ఆర్గానిక్‌ సీడ్స్, ఆయిల్స్‌ను, ఫ్లోనీ పేరుతో న్యూజీలాండ్, హంగేరీ నుంచి సేకరించిన ప్రపంచంలో అరుదైన తేనె రకాలను, జిమ్‌ చేసేవారి కోసం హైవోల్ట్‌ పేరుతో వే, చాకొలేట్‌ బార్స్‌ను విడుదల చేసింది.

Advertisement
 
Advertisement
Advertisement