ఇక విదేశాలకూ విస్తారా విమాన సర్వీసులు

Vistara International Services From August - Sakshi

ఆగస్ట్‌ 6 నుంచి అంతర్జాతీయ సేవలు

ఢిల్లీ నుంచి సింగపూర్‌కు నిత్యం సర్వీసులు

7న ముంబై నుంచి సింగపూర్‌కు

 న్యూఢిల్లీ: టాటా, సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌ సంయుక్త భాగస్వామ్య సంస్థ విస్తారా... ఇక నుంచి అంతర్జాతీయ సర్వీసులను కూడా నడపనుంది. వచ్చే నెల (ఆగస్ట్‌) 6 నుంచి ప్రప్రథమంగా సింగపూర్‌కు ఢిల్లీ నుంచి రోజువారీ విమాన సర్వీసులను ఆరంభిస్తోంది. ఆ మరుసటి రోజే ఆగస్ట్‌ 7న ముంబై నుంచి కూడా సింగపూర్‌కు డైలీ సర్వీసులను ప్రారంభించనుంది. ఢిల్లీ నుంచి ఒకటి, ముంబై నుంచి ఒకటి మొత్తం రెండు ఫ్లయిట్లను నడపనుంది. అంతర్జాతీయంగా మరిన్ని కేంద్రాలకు త్వరలోనే సర్వీసులను విస్తరించనున్నట్టు సంస్థ తెలిపింది. ఇరువైపుల ప్రయాణానికి అన్ని చార్జీలతో కలిపి ప్రారంభ ధరలను ప్రకటించింది. ఢిల్లీ నుంచి సింగపూర్‌కు వెళ్లి, తిరిగి ఢిల్లీకి వచ్చేందుకు ఎకానమీ క్లాస్‌లో రూ.21,877, బిజినెస్‌ క్లాస్‌లో రూ.76,890గా నిర్ణయించింది.అలాగే, ముంబై నుంచి సింగపూర్‌కు, సింగపూర్‌ నుంచి ముంబైకి రానుపోను చార్జీని ఎకానమీ క్లాస్‌కు రూ.20,778, బిజినెస్‌ క్లాస్‌కు రూ.63,331గా నిర్ణయించింది. చాలా ముఖ్యమైన మార్కెట్‌ అయినందునే తొలుత సింగపూర్‌కు సర్వీసులు ఆరంభిస్తున్నట్టు విస్తారా సీఈవో లెస్లీథాంగ్‌ తెలిపారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top