సిమ్ రీచార్జ్‌తో రెండో సిమ్‌కూ టాక్‌టైం! | uninor bandhan plan from uninor | Sakshi
Sakshi News home page

సిమ్ రీచార్జ్‌తో రెండో సిమ్‌కూ టాక్‌టైం!

Sep 9 2014 12:10 AM | Updated on Sep 2 2017 1:04 PM

సిమ్ రీచార్జ్‌తో రెండో సిమ్‌కూ టాక్‌టైం!

సిమ్ రీచార్జ్‌తో రెండో సిమ్‌కూ టాక్‌టైం!

దేశంలో క్రియాశీల మొబైల్ కనెక్షన్ల సంఖ్య దాదాపు 80 కోట్లు.

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశంలో క్రియాశీల మొబైల్ కనెక్షన్ల సంఖ్య దాదాపు 80 కోట్లు. వీరిలో మహిళా చందాదారుల సంఖ్య 30-35 శాతం ఉండొచ్చని అంటోంది టెలికం రంగ సంస్థ యునినార్. ఈ అంతరాన్ని తొలగించేందుకు తనవంతుగా ‘బంధన్’ పేరుతో రెండు సిమ్‌లతో కూడిన ప్యాక్‌ను త్వరలో దేశవ్యాప్తంగా ప్రవేశపెట్టనుంది.

ఉత్తరప్రదేశ్‌లోని అలీఘర్ జిల్లాలో 87 గ్రామాల్లో ప్రస్తుతం పైలట్ ప్రాజెక్టు కింద ఈ ప్యాక్‌ను పరిచయం చేసింది. మొదటి సిమ్‌కు ఎంత మొత్తమైతే రీచార్జ్ చేస్తారో అన్ని నిముషాల టాక్‌టైం రెండో సిమ్‌కు వచ్చి చేరడం దీని ప్రత్యేకత. ఉదాహరణకు రూ.50 రీచార్జ్ చేస్తే రెండో సిమ్‌కు 50 నిముషాల టాక్‌టైం జమవుతుంది. జీఎస్‌ఎం ఆపరేటర్ల ప్రపంచ సమాఖ్య.. జీఎస్‌ఎంఏతో కలిసి యునినార్ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.

 స్పందన అనూహ్యం..
 మొబైల్ ఫోన్ వాడని మహిళలు భారత్‌లో కోట్లలోనే ఉన్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో. మహిళలూ మొబైల్ ఫోన్లు వినియోగించేలా చేయడమే కార్యక్రమ ముఖ్యోద్ధేశమని యునినార్ సీఎంవో రాజీవ్ సేథి సాక్షి బిజినెస్ బ్యూరోకు సోమవారం తెలిపారు. ఈ ప్యాక్‌కు అనూహ్య స్పందన లభిస్తోందని వివరించారు. రెండు సిమ్‌లలో ఒకరు ఖచ్చితంగా మహిళ అయి ఉండాలన్న నిబంధన విధించామన్నారు.

 ప్రాజెక్ట్ సంపర్క్ పేరుతో పైలట్ ప్రాజెక్టును ప్రారంభించామని.. ఫలితాలనుబట్టి ఆంధ్ర ప్రదేశ్‌తోసహా(తెలంగాణ, సీమాంధ్ర) అన్ని సర్కిళ్లకు బంధన్‌ను విస్తరిస్తామని రాజీవ్ తెలిపారు. కాగా, 7 నెలల ప్రాజెక్టులో భాగంగా యునినార్, జీఎస్‌ఎంఏకు చెందిన మొబైల్ ఫర్ డెవలప్‌మెంట్ ఫౌండేషన్‌లు రూ.1.10 కోట్లను  వెచ్చిస్తాయి. ప్రీపెయిడ్ కనెక్షన్లు, రీచార్జ్ వోచర్ల విక్రయంలో మహిళలకు యునినార్ శిక్షణ ఇవ్వనుంది.

Advertisement
 
Advertisement
Advertisement