
సాక్షి, ముంబై : అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) వినియోగదారులకు శుభవార్త చెప్పింది. పండుగ సీజన్ సందర్భంగా కార్ల రుణాలపై ప్రాసెసింగ్ ఫీజను రద్దు చేసినట్టు ప్రకటించింది. రానున్న దసరా, దీపావళి పండుగల సందర్భంగా ఎస్బీఐ ముందుగానే తన కస్టమర్లకు ఈ తీపి కబురు అందించింది. కార్ల రుణాలపై 8.70 శాతం వడ్డీని వసూలు చేయనుంది. యోనో యాప్ లేదా బ్యాంక్ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో కారు రుణం కోసం దరఖాస్తు చేసుకున్న కస్టమర్లకు వడ్డీ రేటుపై మరో 25 బీపీఎస్ పాయింట్ల రాయితీ లభిస్తుంది. అలాగే వేతన జీవులైన బ్యాంకు కస్టమర్లు కారు ఆన్-రోడ్ ధరలో 90 శాతం వరకు రుణాన్ని పొందవచ్చు.