జియోతో రూ.65,000 కోట్లు ఆదా!!
చౌక డేటా ధరలు ఇందుకు కారణం
ఐఎఫ్సీ నివేదికలో వెల్లడి
న్యూఢిల్లీ: రిలయన్స్ జియో వల్ల కన్సూమర్లకు వార్షికంగా రూ.65,000 కోట్లమేర ఆదా అయ్యి ఉంటుందని ఇన్స్టిట్యూట్ ఫర్ కాంపిటీటీవ్నెస్ (ఐఎఫ్సీ) తాజాగా తన నివేదికలో పేర్కొంది. ‘జియో చౌక ధరల్లో డేటాను అందుబాటులోకి తీసుకువచ్చింది. సగటున చూస్తే జీబీ డేటా ధర రూ.152 నుంచి రూ.10లకు తగ్గింది. డేటా ధరల్లో గణనీయమైన తగ్గుదల సమాజంలో కొందరు తొలిసారి డేటాను వినియోగించడానికి దోహదపడింది.
ఇంటర్నెట్ను అధిక సంఖ్యాక ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చింది. మా గణాంకాల ప్రకారం.. జియో ఎంట్రీ వల్ల కన్సూమర్లకు వార్షికంగా రూ.65,000 కోట్లు ఆదా అయ్యి ఉంటుంది’ అని ఐఎఫ్సీ వివరించింది. ఇంటర్నెట్ విస్తరణ పెరుగుదల వల్ల తలసరి జీడీపీలో వృద్ధి నమోదవుతుందని పేర్కొంది. ‘ఇండియన్ టెలికం మార్కెట్లోకి జియో ప్రవేశించిన దగ్గరి నుంచి పరిశ్రమల్లో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకున్నాయి’ అని ఐఎఫ్సీ తెలిపింది.