
ముకేశ్ కోసం ఆధునిక బుల్లెట్ ప్రూఫ్ మెర్సిడెస్ కారు
రిలయన్స్ ఇండస్ట్రీస్ సంస్థ ప్రపంచంలోనే అత్యంత అధునాతనమైన మెర్సిడెస్ బెంజ్ బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని కొనుగోలు చేసింది.
ముంబై: రిలయన్స్ ఇండస్ట్రీస్ సంస్థ ప్రపంచంలోనే అత్యంత అధునాతనమైన మెర్సిడెస్ బెంజ్ బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని కొనుగోలు చేసింది. తమ సీఎండీ ముకేశ్ అంబానీ వ్యక్తిగత భద్రతను మెరుగుపరచడం కోసం ఈ వాహనాన్ని కొనుగోలు చేశామని కంపెనీ పేర్కొంది. లెవల్-9 వెహికల్ రెసిస్టెన్స్(వీఆర్9) ఫీచర్ ఉన్న ఈ 2015 మోడల్ ఎస్600 కారును జర్మనీలోని బెంజ్కు చెందిన సిండెలింజెన్ ప్లాంట్లో కస్టమైజ్ చేయించామని వివరించింది. ఈ కారు బేస్ ధర రూ.1.5 కోట్లని అంచనా.
అయితే భద్రతా ఫీచర్లతో కస్టమైజ్ చేయడం, దిగుమతి సుంకం, రోడ్ ట్యాక్స్, బీమా తదితరాలన్నింటిని కలుపుకుంటే ఈ కారు వ్యయం రూ.11 కోట్లకు పైగానే ఉంటుందని అంచనా. ఈ కారును ముంబై సెంట్రల్ రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీస్(ఆర్టీఓ)లో శనివారం రిజిస్ట్రేషన్ చేయించినట్లు సమాచారం. భారత అతి పెద్ద ప్రైవేట్ కంపెనీ చైర్మన్ అయిన ముకేశ్ అంబానీకి 2013 ఏప్రిల్ నుంచి జెడ్-కేటగిరీ భద్రతను కల్పించారు.
ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి అత్యంత ఆధునిక బుల్లెట్ ప్రూఫ్ కార్లకు డిమాండ్ పెరుగుతోంది. ఈ కారు వెయిటింగ్ లిస్ట్లో రిలయన్స్ 57వ స్థానంలో ఉంది. ఎనిమిది నెలల పాటు ఈ కారు కోసం వెయిటింగ్ చేయాల్సి వచ్చిందని సమాచారం. 2015 మోడల్ ఎస్600 కారు భారత్లో ఇదే మొదటిది.