
సాక్షి,ముంబై: ప్రయివేటు రంగ బ్యాంకు కోటక్ మహీంద్రా బ్యాంకునకు ఆర్బీఐ గట్టి షాక్ ఇచ్చింది. ప్రమోటర్ల వాటాలను సంబంధించి సరిమైన సమాచారం అందించలేదన్నకారణంగా భారీ పెనాల్టీ విధించింది. రూ. 2 కోట్ల రూపాయల జరిమానా విధిస్తూ శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది.
ప్రమోటార్ల వాటాల విలీనానికి సంబంధించి ఆర్బీఐ నిబంధనలను, సూచనలను పాటించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని ఆర్బీఐ వెల్లడించింది. దీంతో 2 కోట్ల రూపాయల నగదు జరిమానా విధించామని పేర్కొంది. బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టం, 1949 లోని నిబంధనల ప్రకారం ఈ పెనాల్టీ అమలుచేస్తున్నట్లు బ్యాంకు ఒక ప్రకటనలో తెలిపింది.
బ్యాంక్లో ప్రమోటార్ల వాటా వివరాలను సమర్పించాల్సిందిగా ఇప్పటికే ఆర్బీఐ ఆదేశించింది. ఈ మార్గదర్శకాలను అమలు చేయడంలో కోటక్ మహీంద్రా బ్యాంక్ విఫలమైందని, నిబంధనలు పాటించనందుకు ఎందుకు జరిమానా విధించకూడదో తెలియజేయాల్సిందిగా షోకాజ్ నోటీసు జారీ చేసినట్లు ఆర్బీఐ తెలిపింది. బ్యాంకు నుంచి వచ్చిన సమాధానాన్ని పరిశీలించిన తరువాతజరిమానా విధించేందుకు నిర్ణయించామని ఆర్బీఐ స్పష్టం చేసింది.