పెద్దలకు పరిపూర్ణ రక్షణ

Only 18persant senior citizens have health insurance - Sakshi

హెల్త్‌ ఇన్సూరెన్స్‌ తప్పకుండా తీసుకోవాలి

తగినంత కవరేజీ అవసరం

కంపెనీ ఇన్సూరెన్స్‌ ఉన్నా విడిగా పాలసీ తీసుకోవాలి

వృద్ధాప్యంలో ప్రత్యేకంగా వైద్య అత్యవసర నిధి

పాలసీలో చెల్లించని ఖర్చుల కోసం ఇది అవసరం

50 ఏళ్లు వచ్చే సరికి బీమా ఉండేలా చూసుకోవాలి

మన దేశ జనాభాలో వృద్ధులు (సీనియర్‌ సిటిజన్లు) 2015 నాటికి 8 శాతానికి చేరారు. 2050 నాటికి 19 శాతం వృద్ధులే ఉంటారని అంచనా. ప్రతీ ఇంటిలోనూ 60 ఏళ్లు నిండిన వయసు వారు ఆ కుటుంబానికి ఓ పెద్ద ఆస్తి వంటివారే. కుటుంబం కోసం అప్పటి వరకు వారు ఎంతో పాటు పడి, ఎంతో శ్రమకోర్చి ఉంటారు. కానీ, వృద్ధాప్యంలో వారిని చుట్టుముట్టే ఆరోగ్య, జీవనశైలి సమస్యలెన్నో. వీటి కోసం చేయాల్సిన ఖర్చు కొన్ని సందర్భాల్లో భారీగానూ ఉంటుంది.

వయసుతోపాటు పెరిగే ఆరోగ్య సంరక్షణ వ్యయాలకు ప్రతీ కుటుంబం తగినంత సన్నద్ధతతో ఉండాలి. అయితే, సీనియర్‌ సిటిజన్లు, వారి పిల్లలు హెల్త్‌ కవరేజీ విషయంలో తగినంత రక్షణతో లేనట్టు ఆదిత్య బిర్లా హెల్త్‌ ఇన్సూరెన్స్‌ ఇటీవల నిర్వహించిన సర్వే ద్వారా తెలిసింది. ‘‘ఉమ్మడి కుటుంబాలు కాస్తా ఏక కుటుంబంగా మారుతున్న రోజుల్లో.. పిల్లలు పెద్ద పట్టణాలకు, విదేశాలకు జీవనోపాధి కోసం తరలిపోతుండడంతో పెద్దల జీవనం, వారి సంరక్షణ సవాలుగా మారుతున్నాయి’’ అని ఆదిత్య బిర్లా హెల్త్‌ ఇన్సూరెన్స్‌ సీఈవో మయాంక్‌ భత్వాల్‌ పేర్కొన్నారు.

ఈ క్రమంలో వృద్ధాప్యంలో సంక్షేమం, ఆరోగ్యం కోసం అవసరమైన చర్యలను ముందు నుంచే తీసుకోవడం శ్రేయస్కరం. ఇందుకు వైద్య బీమాతో పాటు ఇతరత్రా తీసుకోతగిన చర్యలు  సూచించే కథనమే ఇది. 50 ఏళ్లకు వచ్చిన వారికి పదవీ విరమణ తీసుకునేందుకు మరో 10 ఏళ్ల వరకు సమయం మిగిలి ఉంటుంది. ఈ కాలాన్ని వైద్య అత్యవసర నిధి సమకూర్చుకునేందుకు వినియోగించుకోవాలి. ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్స్‌ పథకాల్లో సిప్‌ రూపంలో పదేళ్ల పాటు ఇన్వెస్ట్‌ చేయడం ద్వారా అవసరమైనంత నిధిని సమకూర్చుకోవచ్చని సెబీ రిజిస్టర్డ్‌ పెట్టుబడి సలహాదారులు రేణు మహేశ్వరి సూచించారు.

హెల్త్‌ ఇన్సూరెన్స్‌ ఉన్నప్పటికీ తన వంతుగా రోగి చెల్లించాల్సి వస్తే అందుకోసం వైద్య అత్యవసర నిధి అక్కరకు వస్తుంది. అవుట్‌ పేషెంట్‌గా తీసుకునే చికిత్సలకు అన్ని పాలసీల్లోనూ కవరేజీ ఉండకపోవచ్చు. కనుక అవుట్‌ పేషెంట్‌ వైద్య సేవలకు చేసే చెల్లింపులు, ఆస్పత్రికి రాను, పోను చార్జీలు ఇవన్నీ రోగి తన పాకెట్‌ నుంచే పెట్టుకోవాల్సి రావచ్చు. ఇంటి నుంచే నర్సింగ్, చికిత్సల సేవలను పొందాల్సి వస్తే అయ్యే వ్యయాలు ఎక్కువగానే ఉంటాయి. అత్యవసర నిధి ఉంటే దాన్నుంచి వీటికి చెల్లింపులు చేసుకోవచ్చు.  ఒక్కసారి అత్యవసర నిధి సిద్ధం చేసుకున్న తర్వాత.. మొత్తాన్ని ఒకే చోట కాకుండా.. సేవింగ్స్‌ డిపాజిట్, లిక్విడ్‌ ఫండ్స్, అల్ట్రా షార్ట్‌ టర్మ్‌ డెట్‌ ఫండ్స్, ఫిక్స్‌డ్‌ డిపాజిట్స్‌ రూపంలో ఉంచుకోవాలి.  

గ్రూపు హెల్త్‌ ఇన్సూరెన్స్‌లో పెద్దలకు చోటు
ఉద్యోగం చేసే చోట గ్రూపు హెల్త్‌ ఇన్సూరెన్స్‌ కవరేజీని సంస్థ ఆఫర్‌ చేస్తుంటుంది. ఇందులో తమ తల్లిదండ్రుల పేర్లను కూడా యాడ్‌ చేసుకోవడం మంచిది. ఎందుకంటే సాధారణంగా గ్రూప్‌ హెల్త్‌ కవరేజీలో ప్రీమియం కొంచెం తక్కువగా ఉంటుంది. ముందు నుంచే తల్లిదండ్రులను యాడ్‌ చేస్తే ప్రీమియం భారం తగ్గించుకోవచ్చు. దీనికి తోడు తల్లిదండ్రులకు విడిగా హెల్త్‌ కవరేజీ కూడా తీసుకోవాలి. ‘‘చాలా సంస్థలు తల్లిదండ్రులకు దీర్ఘకాలం  కవరేజీని ఆఫర్‌ చేయడం లేదు. అందుకే ముందు తల్లిదండ్రులను గ్రూపు హెల్త్‌ ఇన్సూరెన్స్‌లో చేర్చుకున్నా కానీ, కొన్ని సంవత్సరాల తర్వాత ఖర్చులను తగ్గించుకునేందుకు తొలగించాల్సి రావచ్చు. పైగా ఈ పాలసీల్లో పెద్దలకు కవరేజీ తక్కువగా రూ.2–3 లక్షల వరకే ఉంటుంది. ఉద్యోగం మానేసినా, లేక సంస్థ మారినా ఈ కవరేజీని కోల్పోవాల్సి వస్తుంది’’ అని పాలసీబజార్‌ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ విభాగం హెడ్‌ అమిత్‌ ఛబ్రా పేర్కొన్నారు.  

అవసరమైనంత కవరేజీ  
తగినంత హెల్త్‌ ఇన్సూరెన్స్‌ కవరేజీ తీసుకోవడం ఎంతో అవసరం. ‘‘మీరు నివసించే ప్రాంతం, జీవన శైలి, ప్రస్తుత ఆరోగ్య పరిస్థితులు.. ఆధారంగా ఎంత మేర సమ్‌ ఇన్సూర్డ్‌ (బీమా మొత్తం) తీసుకోవాలన్నది ఉంటుంది’’ అని మణిపాల్‌ సిగ్నా హెల్త్‌ ఇన్సూరెన్స్‌ ఎండీ ప్రసూన్‌ సిక్‌దర్‌ తెలిపారు. మెట్రోలో ఉంటున్న వారు, ఆస్పత్రిలో సింగిల్‌రూమ్‌ కోరుకునే వారు అధిక కవరేజీ తీసుకోవడం అవసరం. వృద్ధ దంపతులకు రూ.10–20 లక్షల కవరేజీ, ఆ వయసులో విడిగా ఒకరికి అయితే రూ.7–10 లక్షల వరకైనా బీమా తీసుకోవాలి.  

ఆలస్యం చేయవద్దు
50 ఏళ్లకి వచ్చే సరికి దంపతులు ఎట్టి పరిస్థితుల్లోనూ వైద్య బీమా కవరేజీ ఉండేలా చూసుకోవాలి. వైద్య బీమా అన్నది తగినంత లేకపోతే సూపర్‌ టాపప్‌ ద్వారా దాన్ని పెంచుకోవాలి. అదే 60 ఏళ్లు నిండిన తర్వాత కొత్తగా హెల్త్‌ పాలసీ తీసుకోవాలన్నా, సమ్‌ ఇన్సూర్డ్‌ మొత్తాన్ని పెంచుకోవాలన్నా లేక సూపర్‌ టాపప్‌ తీసుకోవాలన్నా అది కష్టంగా మారుతుంది. ‘‘ఒక వ్యక్తి 60 ఏళ్ల వయసులోకి ప్రవేశించారంటే వారికి కఠిన అండర్‌రైటింగ్‌ నిబంధనలు అమలవుతాయి. ఉదాహరణకు పాలసీ తీసుకునే ముందు వైద్య పరీక్షలు తప్పనిసరి’’ అని సిక్‌దర్‌ తెలిపారు. ముందస్తు వ్యాధులున్న వారికి బీమా కంపెనీలు బీమాకు నిరాకరిస్తున్నాయి కూడా. సీనియర్‌ సిటిజన్ల కోసం ఉద్దేశించిన పాలసీలు నేడు ఎన్నో అందుబాటులో ఉన్నాయి. ముందస్తు వ్యాధులకు ఇవి కవరేజీని ఆఫర్‌ చేస్తున్నప్పటికీ.. ఎన్నో పరిమితులను విధిస్తున్నాయి. కనుక వీటిని దృష్టిలో ఉంచుకోవాలి.

కోపేమెంట్‌ ఎంత..?
సీనియర్‌ సిటిజన్‌ పాలసీల్లో ఎక్కువ వాటిల్లో కోపేమెంట్‌ ఆప్షన్‌ ఉంటోంది. కోపేమెంట్‌ అంటే వైద్య చికిత్సా వ్యయాల్లో రోగి తన వంతుగా చెల్లించాల్సిన వాటా. ఇది పాలసీలను బట్టి 10–30 శాతం మధ్య ఉండొచ్చు. క్లెయిమ్‌ మొత్తంలో ఈ మేరకు పాలసీదారులు భరించగా, మిగిలినది బీమా కంపెనీలు చెల్లిస్తాయి. కనుక కోపేమెంట్‌ క్లాజ్‌ లేని పాలసీ తీసుకోవాలి. లేదంటే పాలసీదారుని వాటా తక్కువగా ఉండేదానిని ఎంచుకోవడం మంచిది.  

ఉప పరిమితులు
బీమా సంస్థలు చెల్లింపుల్లో ఉప పరిమితులను కూడా విధిస్తుంటాయి. అంటే, ఫలానా వ్యాధికి గరిష్టంగా ఇంత మొత్తమని లేదా సమ్‌ ఇన్సూర్డ్‌లో నిర్ణీత శాతాన్ని చెల్లిస్తామన్న నిబంధనలు ఉంటాయి. ఉదాహరణకు గుండె సంబంధిత సమస్యలకు గరిష్టంగా రూ.3 లక్షలే చెల్లిస్తామనే పరిమితి ఉండొచ్చు. అదే కేటరాక్ట్‌ సర్జరీ అయితే గరిష్ట చెల్లింపులను రూ.25,000కు పరిమితం కావొచ్చు. ఒకవేళ ఇంతకు మించి వ్యయం అయితే దాన్ని పాలసీదారులే భరించాల్సి ఉంటుంది. అలాగే అన్ని పాలసీల్లో కాకపోయినా కొన్నింటిలో రూమ్‌ రెంట్, ఐసీయూ రెంట్‌ పరంగా ఉప పరిమితులు కూడా ఉంటుంటాయి. వీటితో మొత్తం పాలసీ చెల్లింపులు కూడా మారిపోతాయి. అందుకే పాలసీ తీసుకునే ముందుగానే వీటన్నింటినీ తెలుసుకోవాలి.  

వేచి ఉండే కాలం
సీనియర్‌ సిటిజన్‌ పాలసీల్లో రెండు రకాల వేచి ఉండే కాలావధి (వెయిటింగ్‌ పీరియడ్‌) ఆప్షన్లు ఉంటుంటాయి. ముందు నుంచీ ఉన్న వ్యాధులకు వర్తించేది ఒకటి. పాలసీ తీసుకున్నాకా రెండు నుంచి నాలుగేళ్లు Výæడిచాకే వీటికి కవరేజీనిస్తాయి. కేటరాక్ట్, మోకీలు మార్పిడి తదితర (కొంత కాలానికి వ్యాప్తి చెందేవి) చికిత్సలకు కవరేజీ కోసం పాలసీ తీసుకున్నాక రెండేళ్ల పాటు ఆగాల్సి రావడం మరొకటి. అంటే ఈ కాలంలో చికిత్సలు చేయించుకోవాల్సి వస్తే అందుకు అయ్యే వ్యయాలను పాలసీదారులే పెట్టుకోవాల్సి వస్తుంది. దాదాపు అన్ని పాలసీల్లోనూ ఈ నిబంధనలు ఉంటున్నాయి.

ఆదిత్య బిర్లా హెల్త్‌ ఇన్సూరెన్స్‌ సర్వే అంశాలు
     ♦ 18% తల్లిదండ్రులకే హెల్త్‌ కవరేజీ ఉంది. అంటే మెజారిటీకి కవరేజీ లేదు.
     ♦  26 శాతం తల్లిదండ్రులు వైద్య పరంగా అత్యవసర పరిస్థితుల్లో చెల్లింపులకు పిల్లలపైనే ఆధారపడుతున్నారు. అంటే నాలుగింట మూడొంతుల మందికి తగినంత పెట్టుబడులు, పొదుపు నిధుల్లేవు.
     ♦  29 శాతం మంది తమ తల్లిదండ్రులను కంపెనీ లేదా ప్రభుత్వ వైద్య బీమా కవరేజీలో భాగం చేసినట్టు చెప్పారు. వీరికి ప్రత్యేకంగా కవరేజీ అవసరం కూడా ఉంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top