ఓఎన్‌జీసీకి చమురు క్షేత్రాల అప్పగింత | ONGC JV Transfer The Panna Mukta Fields Back To ONGC | Sakshi
Sakshi News home page

ఓఎన్‌జీసీకి చమురు క్షేత్రాల అప్పగింత

Dec 20 2019 6:30 PM | Updated on Dec 20 2019 6:31 PM

ONGC JV Transfer The Panna Mukta Fields Back To ONGC - Sakshi

ముంబై : పన్నా- ముక్తా చమురు సహజ వాయు క్షేత్రాలపై పాతిక సంవత్సరాల పాటు పనిచేసిన అనంతరం షెల్‌, రిలయన్స్‌, ఓఎన్‌జీసీలతో కూడిన జాయింట్‌ వెంచర్‌ ఆ చమురు క్షేత్రాలను తిరిగి ఓఎన్‌జీసీకి అప్పగించింది. ఈ ఏడాది డిసెంబర్‌ 21న ఒప్పందం ముగియటంతో వీటిని జాయింట్‌వెంచర్‌ సంస్థ ఓఎన్‌జీసీకి తిరిగి బదలాయించింది. ఈ సందర్భంగా రిలయన్స్‌ ఇండస్ర్టీస్‌ ప్రెసిడెంట్‌ (ఈఅండ్‌పీ) బి. గంగూలీ మాట్లాడుతూ పన్నా-ముక్తా చమురు క్షేత్రం నుంచి దేశీ చమురు ఉత్పాదనలో దాదాపు ఆరు శాతం సమకూర్చామని ఇక 2007-08లో​ దేశ గ్యాస్‌ ఉత్పత్తిలో దాదాపు ఏడు శాతం ఇక్కడి గ్యాస్‌ క్షేత్రాల నుంచి సమకూరిందని చెప్పారు.

దేశ చమురు, గ్యాస్‌ రంగంలో ఇతోథిక వృద్ధికి ఇంధనం సమకూర్చడం ద్వారా మెరుగైన పయనంలో రిలయన్స్‌ భాగస్వామిగా ఉందని అన్నారు. ఇక బీజీఈపీఐల్‌ ఎండీ త్రివిక్రమ్‌ అరుణ్‌ మాట్లాడుతూ ప్రభుత్వ రంగ ఓఎన్‌జీసీతో ప్రైవేట్‌ రంగ రిలయన్స్‌, అంతర్జాతీయ ఆయిల్‌ దిగ్గజం షెల్‌తో కలిసి ఏర్పాటైన ఈ జాయింట్‌ వెంచర్‌ ఇంధన రంగంలో అద్భుత ఉదాహరణగా నిలిచిపోతుందని వ్యాఖ్యానించారు. ఒప్పందం ముగియగానే చమురు, సహజవాయు క్షేత్రాలను తిరిగి సురక్షితంగా ఓఎన్‌జీసికి అప్పగించామని వెల్లడించారు.

Advertisement
 
Advertisement
Advertisement