breaking news
oil and gas sector
-
ఇంధన రంగంలో 67 బిలియన్ డాలర్ల పెట్టుబడులు
గోవా: భారత్ వృద్ధి బాటలో భాగస్వామ్యం కావాలని ప్రపంచ పెట్టుబడిదారులను భారత్ ఆహ్వనిస్తోందని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. వచ్చే 5 నుండి 6 సంవత్సరాలలో భారతదేశం ఇంధన రంగంలో 67 బిలియన్ డాలర్ల పెట్టుబడులను ఆకర్షిస్తుందన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఇండియా ఎనర్జీ వీక్.. రెండవ ఎడిషన్ను ఇక్కడ ప్రారంభించిన ప్రధాని ఈ సందర్భంగా మాట్లాడుతూ, భారత్ ఎకానమీ 7.5%కన్నా అధిక వృద్ధి రేటుతో పురోగమిస్తోందన్నారు. అమెరికా (25.5 ట్రిలియన్ డాలర్లు) చైనా (18 ట్రిలియన్ డాలర్లు), జపాన్ (4.2 ట్రిలియన్ డాలర్లు), జర్మనీ (4 ట్రిలియన్ డాలర్లు)ల తర్వాత దాదాపు 3.8 ట్రిలియన్ డాలర్లతో ప్రస్తుతం ప్రపంచంలో ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారత్, త్వరలో మూడో స్థానానికి చేరడం ఖాయమని మోదీ ఉద్ఘాటించారు. ఇదే విషయాన్ని పలు సంస్థలూ స్పష్టం చేస్తున్నాయని ప్రధాని అన్నారు. 2030 నాటికి దేశం తన రిఫైనింగ్ సామర్థ్యాన్ని 254 ఎంఎంటీపీఏ (సంవత్సరానికి మిలియన్ మెట్రిక్ టన్నులు) నుండి 450 ఎంఎంటీపీఏకి పెంచుతుందని భావిస్తున్నామని ఆయన పేర్కొంటూ... ఈ నేపథ్యంలో భారతదేశ ఇంధన రంగ వృద్ధిలో పాలుపంచుకోవాలని ప్రపంచ ఇన్వెస్టర్లను ఆహ్వానించారు. ఇంధన రంగంలో మునుపెన్నడూ జరగని విధంగా భారతదేశం భారీ పెట్టుబడులు పెడుతోందని ప్రధాని అన్నారు. 2045 నాటికి దేశ ప్రాథమిక ఇంధన డిమాండ్ రెట్టింపు అవుతుందని కూడా ఆయన చెప్పారు. ముడిచమురు, ఎల్పీజీల్లో మూడో స్థానం... ముడిచమురు, ఎల్పీజీ వినియోగం విషయంలో భారత్ మూడవ అతిపెద్ద దేశంగా ఉందని ప్రధాని పేర్కొన్నారు. ఎల్ఎన్జీ విషయంలో నాల్గవ అతిపెద్ద దిగుమతిదారుగా భారతదేశం ఉందని మోదీ అన్నారు. గత రెండేళ్లలో భారతదేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గాయని పేర్కొన్న ఆయన, ప్రపంచ సవాళ్ల నేపథ్యంలో దేశం ఇంధన నిర్వహణ వ్యూహాన్ని పటిష్టంగా అమలు చేస్తున్నట్లు వివరించారు. ప్రభుత్వ సంస్కరణలు దేశీయ సహజ వాయువు ఉత్పత్తిని పెంచడంలో సహాయపడుతున్నాయని మోదీ తెలిపారు. చమురు, గ్యాస్ రంగంలో ఇన్వెస్ట్ చేయండి ► గ్లోబల్ దిగ్గజ సంస్థల సీఈవోలతో ప్రధాని భేటీ చమురు, గ్యాస్ రంగంలో ప్రత్యేకించి అన్వేషణ, ఉత్పత్తిలో పెట్టుబడులకు వేగంగా అభివృద్ధి చెందుతున్న భారత్లో అపార అవకాశాలు ఉన్నాయని ప్రధాని మోదీ ఈ రంగంలో ప్రముఖ ఎగ్జిక్యూటివ్లకు విజ్ఞప్తి చేశారు. ఇండియా ఎనర్జీ వీక్ సందర్భంగా ఎక్సాన్మొబిల్, బీపీల నుండి ఖతార్ ఎనర్జీ, ఫ్రెంచ్ దిగ్గజం టోటల్ ఎనర్జీస్ వరకు దాదాపు 20 మంది టాప్ ఎగ్జిక్యూటివ్లతో మోదీ సమావేశమయినట్లు అత్యున్నత స్థాయి వర్గాలు తెలిపాయి. ఈ సమావేశానికి హాజరైన భారతీయ సీఈఓలలో వేదాంత చైర్మన్ అనిల్ అగర్వాల్తో పాటు రిలయన్స్ అధికారులు ఉన్నారు. దేశంలో చమురు, గ్యాస్ వనరులను కనుగొని, ఉత్పత్తి చేయడంలో పెట్టుబడులు పెట్టేందుకుగాను ప్రపంచ దిగ్గజ సంస్థలను ఆహ్వానించేందుకు ఇటీవల ప్రారంభించిన ‘ఎక్స్ప్లోరేషన్ లైసెన్సింగ్ రౌండ్’ విధానాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. కాగా, రానున్న మూడేళ్లలో చమురు, గ్యాస్ ఉత్పత్తిని రోజుకు 300,000 బ్యారెళ్లకు రెట్టింపు చేయడానికి 4 బిలియన్ డాలర్ల భారీ పెట్టుబడికి తమ సంస్థ యోచిస్తున్నట్లు ఈ సందర్భంగా అనిల్ అగర్వాల్ తెలిపారు. ఖతార్తో ఎల్ఎన్జీ డీల్ పొడిగింపు ► 20 ఏళ్లకు 78 బిలియన్ డాలర్ల డీల్ ►ఏటా 6 బిలియన్ డాలర్ల ఆదా బెతుల్ (గోవా): ద్రవీకృత సహజ వాయువు (ఎల్ఎన్జీ) దిగుమతులకు సంబంధించిన డీల్ను మరో 20 ఏళ్ల పాటు పొడిగిస్తూ ఖతార్ఎనర్జీతో దేశీ దిగ్గజం పెట్రోనెట్ ఎల్ఎన్జీ ఒప్పందం కుదుర్చుకుంది. దీని విలువ 78 బిలియన్ డాలర్లుగా ఉంటుంది. ఈ డీల్ 2048 వరకు అమల్లో ఉంటుంది. ఏటా 7.5 మిలియన్ టన్నుల ఎల్ఎన్జీ కొనుగోలు కోసం ఖతార్ఎనర్జీతో ఒప్పందాన్ని పొడిగించుకున్నట్లు పెట్రోనెట్ ఎల్ఎన్జీ ఒక ప్రకటనలో తెలిపింది. విద్యుత్, ఎరువుల ఉత్పత్తి కోసం ఈ గ్యాస్ ఉపయోగపడనున్నట్లు పేర్కొంది. ప్రస్తుత రేట్ల కన్నా తక్కువ ధరకే ఎల్ఎన్జీని ఖతార్ సరఫరా చేయనుండటంతో భారత్కు ఏటా 6 బిలియన్ డాలర్లు ఆదా కాగలదని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇప్పుడున్న ధరలతో పోలిస్తే కొత్త ఒప్పందం ప్రకారం యూనిట్కు (ఎంబీటీయూ) భారత్కి 0.8 డాలర్ల మేర మిగులుతుందని పేర్కొన్నాయి. ప్రస్తుతం బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ ధర 80 డాలర్లుగా ఉండగా ఏటా 7.5 మిలియన్ టన్నుల ఎల్ఎన్జీ దిగుమతుల బిల్లు 3.9 బిలియన్ డాలర్లుగా ఉండనుంది. ఇంధన రంగంలో స్వయం సమృద్ధి సాధించాలనే భారత్ లక్ష్యానికి ఈ కాంట్రాక్టు తోడ్పడగలదని కేంద్ర చమురు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి తెలిపారు. భారత ఎకానమీ వృద్ధిలో తాము కూడా భాగంగా ఉండాలని ఆశిస్తున్నట్లు ఖతార్ ఇంధన శాఖ మంత్రి, ఖతార్ఎనర్జీ సీఈవో సాద్ అల్–కాబి తెలిపారు. ఎల్ఎన్జీ సరఫరా కోసం ఆ్రస్టేలియా, అమెరికా, రష్యాతో కూడా భారత్ ఒప్పందాలు కుదుర్చుకుంది. ప్రస్తుతం ఏటా 8.5 ఎంటీపీఏ దిగుమతి.. ఖతార్ఎనర్జీ నుంచి పెట్రోనెట్ రెండు కాంట్రాక్టుల కింద ఏటా 8.5 మిలియన్ టన్నుల (ఎంటీపీఏ) ఎల్ఎన్జీ దిగుమతి చేసుకుంటోంది. వాటిలో 25 ఏళ్లకు సంబంధించిన 2024లో కుదుర్చుకున్న ఒక ఒప్పందం 2028తో ముగిసిపోనుంది. దీన్నే పెట్రోనెట్ తాజాగా పొడిగించింది. భారత ఎల్ఎన్జీ దిగుమతుల్లో ఖతార్ ఎనర్జీతో పెట్రోనెట్ ఒప్పందం వాటా దాదాపు 35%గా ఉంటుంది. -
ఓఎన్జీసీకి చమురు క్షేత్రాల అప్పగింత
ముంబై : పన్నా- ముక్తా చమురు సహజ వాయు క్షేత్రాలపై పాతిక సంవత్సరాల పాటు పనిచేసిన అనంతరం షెల్, రిలయన్స్, ఓఎన్జీసీలతో కూడిన జాయింట్ వెంచర్ ఆ చమురు క్షేత్రాలను తిరిగి ఓఎన్జీసీకి అప్పగించింది. ఈ ఏడాది డిసెంబర్ 21న ఒప్పందం ముగియటంతో వీటిని జాయింట్వెంచర్ సంస్థ ఓఎన్జీసీకి తిరిగి బదలాయించింది. ఈ సందర్భంగా రిలయన్స్ ఇండస్ర్టీస్ ప్రెసిడెంట్ (ఈఅండ్పీ) బి. గంగూలీ మాట్లాడుతూ పన్నా-ముక్తా చమురు క్షేత్రం నుంచి దేశీ చమురు ఉత్పాదనలో దాదాపు ఆరు శాతం సమకూర్చామని ఇక 2007-08లో దేశ గ్యాస్ ఉత్పత్తిలో దాదాపు ఏడు శాతం ఇక్కడి గ్యాస్ క్షేత్రాల నుంచి సమకూరిందని చెప్పారు. దేశ చమురు, గ్యాస్ రంగంలో ఇతోథిక వృద్ధికి ఇంధనం సమకూర్చడం ద్వారా మెరుగైన పయనంలో రిలయన్స్ భాగస్వామిగా ఉందని అన్నారు. ఇక బీజీఈపీఐల్ ఎండీ త్రివిక్రమ్ అరుణ్ మాట్లాడుతూ ప్రభుత్వ రంగ ఓఎన్జీసీతో ప్రైవేట్ రంగ రిలయన్స్, అంతర్జాతీయ ఆయిల్ దిగ్గజం షెల్తో కలిసి ఏర్పాటైన ఈ జాయింట్ వెంచర్ ఇంధన రంగంలో అద్భుత ఉదాహరణగా నిలిచిపోతుందని వ్యాఖ్యానించారు. ఒప్పందం ముగియగానే చమురు, సహజవాయు క్షేత్రాలను తిరిగి సురక్షితంగా ఓఎన్జీసికి అప్పగించామని వెల్లడించారు. -
జోరుగా పెట్టుబడులు..
♦ కొత్త గ్యాస్ విధానాలు ప్రయోజనకరం ♦ స్టాండర్డ్ అండ్ పూర్స్ రేటింగ్ సర్వీసెస్ వెల్లడి న్యూఢిల్లీ: చమురు, గ్యాస్ రంగంలో ప్రభుత్వ కొత్త విధానాలు పెట్టుబడులను ఆకర్షించేలా ఉన్నాయని స్టాండర్డ్ అండ్ పూర్స్ రేటింగ్ సర్వీసెస్ పేర్కొంది. గ్యాస్ రంగంలో కొత్త ధరల విధానం, కష్టతరమైన క్షేత్రాల నుంచి వెలుపలికి తీసే గ్యాస్కు మార్కెటింగ్ స్వేచ్ఛనివ్వడం వంటి అంశాల కారణంగా భారత చమురు గ్యాస్ రంగంలో పెట్టుబడులు వస్తాయని ఈ సంస్థ వివరించింది. ప్రస్తుతమున్న లాభాలు పంచుకునే విధానాన్ని కాకుండా ఆదాయాన్ని పంచుకునే విధానంతో భవిష్యత్ వేలం ప్రక్రియను సరళీకరిస్తూ గత వారం ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అన్ని చమురు అన్వేషణ, ఉత్పత్తి కార్యకలాపాలకు ఒకే ఒక లెసైన్స్ అవసరమయ్యేలా విధానాలను కేంద్ర ప్రభుత్వం రూపొందించింది. ఈ కొత్త విధానాల నేపథ్యంలో స్టాండర్ట్ అండ్ పూర్స్ రేటింగ్ సర్వీసెస్ వెల్లడించిన అంశాల్లో కొన్ని ముఖ్యమైనవి... ♦ కొత్త విధానాలు ఓఎన్జీసీ, ఆర్ఐఎల్కు ప్రయోజనం కలిగిస్తాయి. అయితే తగిన నగదు ప్రయోజనాలు అందడానికి కొన్నేళ్లు పడుతుంది. ♦ ఈ కొత్త విధానాలు పెట్టుబడులను ఆకర్షిస్తాయి. కానీ, కొంత సమయం పడుతుంది. ♦ పలు అన్వేషణ ప్రాజెక్టుల మూలధన కేటాయింపులకు ఆమోదాలు అవసరం. ఇవి కార్యరూపం దాల్చడానికి సమయం పడుతుంది. ఈ ప్రాజెక్టుల్లో ఉత్పత్తి కార్యకలాపాలకు కనీసం మూడేళ్లు పడుతుంది. ♦ ప్రభుత్వంతో ఉన్న ధరల సంబంధిత వివాదాలను రిలయన్స్ ఇండస్ట్రీస్ ఉపసంహరించుకుంటేనే ఆ కంపెనీకి మేలు. కొత్త ధరల విధానంతో ప్రయోజనం పొందాలంటే ఈ వివాదాలకు రిలయన్స్ ఇండస్ట్రీస్ స్వస్తి చెప్పక తప్పదు. ♦ సాధారణ చమురు క్షేత్రాల నుంచి ఉత్పత్తి చేసే గ్యాస్ ధరలు అంతంతమాత్రంగానే ఉండే అవకాశాలుండటంతో సాధారణ చమురు క్షేత్రాలపై పెట్టుబడులు మందగిస్తాయి.