లెసైన్సు రాకున్నా బ్యాంకుల్లో వాటాలు కొనొచ్చు


ముంబై: బ్యాంకింగ్ లెసైన్సు దక్కని సంస్థలు..ఇతర బ్యాంకుల్లో వాటాలు కొనేందుకు చేస్తున్న ప్రయత్నాలపై రిజర్వ్ బ్యాంక్ స్పందించింది. లెసైన్సు దరఖాస్తు తిరస్కరణకు గురైనంత మాత్రాన ఆయా కంపెనీలు.. వేరే బ్యాంకుల్లో వాటాలు కొనుగోలు చేయరాదంటూ ఏమీ లేదని కొత్తగా నియమితులైన ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్ ఆర్ గాంధీ తెలిపారు. లెసైన్సు దరఖాస్తు తిరస్కరణకు గురైనప్పటికీ.. బ్యాంకులో సదరు సంస్థ వాటాదారుగా చేరాలనుకుంటే, ఆ ప్రతిపాదనను పరిశీలిస్తామనిఆయన వివరించారు.



ప్రైవేట్ రంగ బ్యాంక్ యస్ బ్యాంక్‌లో ఎల్‌అండ్‌టీ ఫైనాన్స్ గణనీయంగా వాటాలు పెంచుకోవాలని యోచిస్తున్న నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఏదైనా బ్యాంకులో ఏదైనా కంపెనీ 5 శాతం పైగా వాటాలను కొనాలనుకుంటే ఆర్‌బీఐ అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని గాంధీ చెప్పారు. అన్ని విషయాలను కూలంకషంగా పరిశీలించి తాము నిర్ణయం తీసుకుంటామని, ఏ ఒక్క కంపెనీకో అనుకూలంగానో లేదా వ్యతిరేకంగానో వ్యవహరించమని ఆయన తెలిపారు. కొత్త బ్యాంకింగ్ లెసైన్సును దక్కించుకోవడంలో విఫలమైన ఎల్‌అండ్‌టీ ఫైనాన్స్.. యస్‌బ్యాంకులో వాటాలు కొనాలని యోచిస్తోంది. ఇది దొడ్డిదారిన బ్యాంకింగ్‌లోకి ప్రవేశించడమే అవుతుందని ఆరోపణలు వెల్లువెత్తున్నాయి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top