30 కోట్లు దాటిన జియో చందాదారులు
న్యూఢిల్లీ: రిలయన్స్ జియో చందాదారుల సంఖ్య 30 కోట్లను అధిగమించింది. కార్యకలాపాలు ఆరంభించిన రెండున్నరేళ్లలో ఈ మైలురాయిని చేరుకోవడం గమనార్హం. మార్చి 2న ఇది సాధ్యమైనట్టు కంపెనీ ప్రకటించింది. ప్రస్తుతం కొనసాగుతున్న ఐపీఎల్ సీజన్లో 30 కోట్ల యూజర్ల మార్క్పై కంపెనీ టెలివిజన్ ప్రకటనలు కూడా ఇస్తోంది. 10 కోట్ల మంది చందాదారులను వాణిజ్య కార్యకలాపాలు ఆరంభించిన తర్వాత కేవలం 170 రోజుల్లోనే సొంతం చేసుకుని జియో గతంలోనే రికార్డు నమోదు చేసింది. మరోవైపు ప్రత్యర్థి కంపెనీ భారతీ ఎయిర్టెల్కు జనవరి నాటికి 34 కోట్ల మంది కస్టమర్లు ఉన్నారు. 30 కోట్ల కస్టమర్ల మైలు రాయిని చేరుకునేందుకు ఎయిర్టెల్కు 19 ఏళ్లు పట్టిన విషయం గమనార్హం. వొడాఫోన్ ఐడియా 40 కోట్ల మంది యూజర్లతో ప్రస్తుతం అతిపెద్ద టెలికం కంపెనీగా ఉండగా, ఎయిర్టెల్ రెండో స్థానంలో ఉంది. త్వరలో ఎయిర్టెల్ను వెనక్కి నెట్టి రెండో స్థానాన్ని జియో సొంతం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మరిన్ని వార్తలు