2 రోజుల్లో రూ. 4.14 కోట్లు హాంఫట్‌ | Investors lose over Rs 4 lakh crore in 2 days | Sakshi
Sakshi News home page

2 రోజుల్లో రూ. 4.14 కోట్లు హాంఫట్‌

Sep 12 2018 8:41 AM | Updated on Sep 12 2018 9:27 AM

Investors lose over Rs 4 lakh crore in 2 days - Sakshi

సాక్షి,ముంబై: స్టాక్‌మార్కెట్లు వరుసగా రెండో రోజూ భారీగా పతనమయ్యాయి. గత ఏడు నెలల్లో స్టాక్‌ సూచీలు వరుసగా రెండు రోజుల పాటు ఈ స్థాయిలో పతనం కావడం ఇదే ప్రథమం. భారీ అమ్మకాల ఒత్తిడితో మంగళవారం సెన్సెక్స్‌, నిఫ్టీ మద్దతు స్థాయిలకు దిగువకు  పడిపోయింది. చివరలో సెన్సెక్స్‌ 509 పాయింట్ల పతనంతో 37,413 వద్ద ముగియగా,  నిఫ్టీ 151 పాయింట్లు క్షీణించి 11,288వద్ద ముగిసింది. వాణిజ్యలోటు, ముదురుతున్న వాణిజ్య ఉద్రిక్తతలు, డాలరు మారకంలో పాతాళానికి పడిపోతున్న రూపాయి, మండుతున్నచమురు ధర, ఫెడ్‌ రేట్ల పెంపు భయాలతో ఇన్వెస్టర్లు అమ్మకాలకు పూనుకున్నారు. దీంతో గత రెండు  రోజుల్లో 4 లక్షల కోట్లకు పైగా  సంపద తుడిచి పెట్టుకు పోయింది.

గత రెండు రోజుల స్టాక్‌ మార్కెట్‌ నష్టాల కారణంగా ఇన్వెస్టర్ల సంపద రూ.4.14 లక్షల కోట్లు ఆవిరైంది. కాగా సెన్సెక్స్‌ గత రెండు రోజుల్లో 977 పాయింట్లు నష్టపోయింది. ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్‌ఈలో లిస్టైన మొత్తం కంపెనీల మార్కెట్‌ క్యాప్‌ ఈ రెండు రోజుల్లో రూ.4,14,122  కోట్లు తగ్గి రూ.1,53,25,666 కోట్లకు తగ్గింది. మరోవైపు కీలక  సూచీలు మద్దతు స్థాయిల కిందికి చేరిన నేపథ్యంలో మరింత పతనం నమోదు కావచ్చని  విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఈ నెలలో ఫెడరల్‌ రిజర్వ్‌ రేట్ల పెంపు తథ్యమని, దీంతో డాలర్‌ మరింతగా బలపడుతుందని, విదేశీ నిధులు మరింతగా తరలిపోతాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement