క్యూ3లో అదరగొట్టిన ఇన్ఫీ  | Infosys Q3 profit up 23 Percent | Sakshi
Sakshi News home page

క్యూ3లో అదరగొట్టిన ఇన్ఫీ 

Jan 10 2020 6:10 PM | Updated on Jan 10 2020 6:14 PM

 Infosys Q3 profit up 23 Percent - Sakshi

సాక్షి, ముంబై : ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ త్రైమాసిక ఫలితాల్లో అదరగొట్టింది. 2019-20 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో (అక్టోబర్-డిసెంబర్ కాలం) అంచనాలనుకుమించి లాభాలను  నమోదు చేసింది. క్యు3లో  24 శాతం  ఎగిసి 4457 కోట్ల రూపాయల లాభాలను సాధించింది.  అంతకుముందు త్రైమాసికంలో కంపెనీ 3,609 కోట్ల రూపాయల లాభాలను ఆర్జించింది. 4200 కోట్ల రూపాయల లాభం రానుందని విశ్లేషకులు అంచనా వేశారు. 

గతేడాది క్యూ3తో పోలిస్తే లాభం 23.5 శాతం పుంజుకున్న లాభాలను నమోదు చేసిన ఇన్ఫోసిస్‌ ఆదాయంలోనూ వృద్ధిని సాధించింది. ఈ  త్రైమాసికంలో కంపెనీ రెవెన్యూ రూ. 23092 కోట్లుగా ప్రకటించింది. గతేడాదితో పోలిస్తే రెవెన్యూ 7.9 శాతం పెరిగింది.  అయితే మార్జిన్లు మాత్రం అంచనాల కన్నా కాస్త తక్కువగా వచ్చాయి. దీంతో పాటు 2019-20 ఆర్థిక గైడెన్స్‌ను కంపెనీ పెంచింది.  స్థిర కరెన్సీ రెవెన్యూ గ్రోత్‌ అంచనాలను 10-10.5 శాతంగా ప్రకటించింది. గతంలో ఈ గైడెన్స్‌ 9-10 శాతం మాత్రమే. లాభాల మార్జిన్లు 21- 23 శాతం ఉంటాయని తెలిపింది. మూడో త్రైమాసికంలో కంపెనీ 180 కోట్ల డాలర్ల  భారీ ఒప్పందాలను గెలుచుకుంది. కొత్తగా 84 మంది క్లయింట్లు వచ్చారని తెలిపింది. ఈత్రైమాసికంలో మొత్తం పనితీరు సంతృప్తికరంగా  ఉందనీ,  బడాడీల్స్‌ను సాధించామని ఇన్ఫోసిస్‌​ సీవోవో  ప్రవీణరావు అన్నారు. డిజిటల్ పరివర్తన యుగం, క్లయింట్లతో తమ ప్రయాణంలో  తాము స్థిరంగా ఉన్న సంగతిని క్యూ 3 ఫలితాలు నొక్కిచెప్పాయని ఇన్ఫీ సీఎండీ సలీల్ పరేఖ్ అన్నారు. ఆపరేటింగ్ మార్జిన్లు విస్తరించడంతో, రెండంకెల వృద్ధిలోకి వచ్చాయని,  రెవెన్యూ గ్రోత్‌ అంచనాల పెంపునకు దారితీసిందని పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement