
భారత్కు క్రూడ్ ధరల సెగ..
ఇరాక్లో అంతర్యుద్ధ ప్రభావంతో క్రూడ్ ధరలు ఎగబాకుతుండటంపై ఆర్థిక శాఖ కార్యదర్శి అరవింద్ మాయారామ్ ఆందోళన వ్యక్తం చేశారు.
- పెట్రోలియం రేట్ల కుదుపులతో ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి
- అరవింద్ మాయారామ్ వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: ఇరాక్లో అంతర్యుద్ధ ప్రభావంతో క్రూడ్ ధరలు ఎగబాకుతుండటంపై ఆర్థిక శాఖ కార్యదర్శి అరవింద్ మాయారామ్ ఆందోళన వ్యక్తం చేశారు. పెట్రోలియం ధరల తీవ్ర హెచ్చుతగ్గుల కారణంగా దేశీ ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడికి దారితీస్తోందన్నారు. ముఖ్యంగా మందగమనం నుంచి ఇప్పుడిప్పుడే కొంత ఉపశమనం దిశగా అడుగులేస్తున్న వర్ధమాన ఆర్థిక వ్యవస్థలకు ఇది ప్రతికూలాంశమేనని ఆయన పేర్కొన్నారు. మెల్బోర్న్లో జరిగిన జీ-20 దేశాలకు సంబంధించిన ఒక సమావేశంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఉన్న అంతర్జాతీయ పరిస్థితులతో వర్ధమాన దేశాల ఆర్థిక ప్రగతికి మద్దతు తగ్గిపోతుండగా.. సవాళ్లు మాత్రం అంతకంతకూ ఎగబాకుతున్నాయని అభిప్రాయపడ్డారు.
వృద్ధికి చేయూతనిచ్చేలా విధానాలు...
భారత్లో అధికారంలోకి వచ్చిన కొత్త సర్కారు... వృద్ధికి చేయూతనిచ్చే ఆర్థిక విధానాలను కొనసాగించనుందని జీ-20 సమావేశంలో మాయారామ్ పేర్కొన్నారు. దేశాన్ని మళ్లీ అధిక వృద్ధి బాటలోకి తీసుకురావడం.. దీన్ని స్థిరంగా కొనసాగించే విధంగా సంస్కరణల ప్రక్రియను మరింత బలోపేతం చేయనున్నట్లు ఆయన చెప్పారు. వచ్చే నెలలో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టనున్న తొలి బడ్జెట్లో సంస్కరణ చర్యలు ఉంటాయన్నారు.
అధిక ద్రవ్యోల్బణం ముఖ్యంగా ఆహార ధరలు ఎగబాకుతుండటం... అధిక ద్రవ్యలోటు, సబ్సిడీల బిల్లు వంటి ప్రతికూలతల నేపథ్యంలో బడ్జెట్లో ఎలాంటి చర్యలు ఉంటాయన్న ఉత్కంఠ నెలకొంది. కాగా, ఆర్థిక వ్యవస్థను మందగమనం నుంచి గట్టెక్కించాలంటే కొన్ని కఠిన చర్యలు తప్పవంటూ స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్న కొద్ది రోజులకే రైల్వే ప్రయాణికుల, సరుకు రవాణా చార్జీలను ప్రభుత్వం భారీగా పెంచేసిన సంగతి తెలిసిందే. వరుసగా రెండు ఆర్థిక సంవత్సరాలు(2012-14) దేశ ఆర్థిక వృద్ధిరేటు 5 శాతం దిగువనే కొనసాగడం ఆందోళన కలిగిస్తున్న అంశం.