2019లో దేశంలో కొత్తగా 34 బిలియనీర్లు | India Added 34 New Billionaires in 2019 | Sakshi
Sakshi News home page

2019లో దేశంలో కొత్తగా 34 బిలియనీర్లు

Feb 27 2020 8:41 AM | Updated on Feb 27 2020 8:41 AM

India Added 34 New Billionaires in 2019 - Sakshi

ముంబై: దేశంలో సంపన్నుల సంఖ్య 2019లో ఎక్స్‌ప్రెస్‌ వేగంతో పెరిగింది. ప్రతీ నెలా సుమారు ముగ్గురు చొప్పున కొత్తగా బిలియనీర్లు పుట్టుకొచ్చారు. మొత్తం మీద 2019లో 34 మంది బిలియనీర్లు అదనంగా జత కూడడంతో దేశంలో మొత్తం బిలియనీర్ల సంఖ్య 38కి చేరుకుందని హరూన్‌ గ్లోబల్‌రిచ్‌ లిస్ట్‌ 2020 9వ ఎడిషన్‌ తెలియజేసింది. 67 బిలియన్‌ డాలర్ల నికర విలువతో దేశంలోకెల్లా సంపన్నుడు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముకేశ్‌ అంబానీయేనని ఈ నివేదిక ప్రకటించింది. 799 మంది బిలియనీర్లతో చైనా, 626 మంది బిలియనీర్లతో అమెరికా మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి. భారత్‌కు వెలుపల ఉన్న భారత సంతతికి చెందిన బిలియనీర్లను కూడా కలుపుకుంటే మొత్తం సంఖ్య 170గా ఉంటుందని ఈ నివేదిక తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా బిలియన్‌ డాలర్లు (రూ.7,000 కోట్లు), అంతకుమించిన నికర విలువ ఉన్న వారిని ఈ నివేదిక పరిగణనలోకి తీసుకుంది. ఇలాంటి వారు ప్రపంచవ్యాప్తంగా 2,817 మంది ఉన్నారు. 2019లో ప్రపంచవ్యాప్తంగా బిలియన్‌ డాలర్ల నికర విలువ కలిగిన వారు కొత్తగా 480 మంది తోడయ్యారు. ముఖ్యంగా భారత్‌లో ప్రతీ నెలా ముగ్గురు చొప్పున పెరగ్గా, చైనాలో ప్రతీ వారానికి ముగ్గురు చొప్పున బిలియనీర్లు పుట్టుకొచ్చినట్టు ఈ నివేదిక తెలియజేసింది. 

ముకేశ్‌ అంబానీ 67 బిలియన్‌ డాలర్ల సంపదతో ప్రపంచంలో 9వ సంపన్నుడిగా నిలిచారు.  
అమెజాన్‌ జెఫ్‌ బెజోస్‌ 140 బిలియన్‌ డాలర్లతో మొదటి స్థానంలో ఉన్నారు.
ఎస్‌పీ హిందుజా కుటుంబం 27 బిలియన్‌ డాలర్లు, గౌతం అదానీ 17 బిలియన్‌ డాలర్లు, శివ్‌నాడార్, అతని కుటుంబం 17 బిలియన్‌ డాలర్లు, లక్ష్మీ నివాస్‌ మిట్టల్‌ 15 బిలియన్‌ డాలర్లు, ఉదయ్‌ కోటక్‌ 15 బిలియన్‌ డాలర్లు, అజీమ్‌ ప్రేమ్‌జీ 14 బిలియన్‌ డాలర్లు, సైరస్‌ పూనవాలా 12 బిలియన్‌ డాలర్లు, సైరస్‌ పల్లోంజీ మిస్త్రీ, ఆయన కుమారుడు షాపూర్‌ పల్లోంజీ 11 బిలియన్‌ డాలర్లు, ఓయో ప్రమోటర్‌ రితేష్‌ అగర్వాల్‌ 1.1 బిలియన్‌ డాలర్ల సంపద కలిగి ఉన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement