స్కామ్‌ మెసేజ్‌లతో జాగ్రత్త.. | Got messages or calls asking for Paytm KYC | Sakshi
Sakshi News home page

స్కామ్‌ మెసేజ్‌లతో జాగ్రత్త..

Nov 22 2019 5:34 AM | Updated on Nov 22 2019 5:34 AM

Got messages or calls asking for Paytm KYC - Sakshi

ముంబై: స్కామ్‌ మెసేజ్‌ల పట్ల అప్రమత్తంగా ఉండడం ద్వారా మోసపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కస్టమర్లకు పేటీఎం అధినేత విజయ్‌శేఖర్‌ శర్మ కోరారు. కంపెనీ అధికారులమంటూ మోసగాళ్లు పంపే ఈ మెయిల్స్, మెసేజ్‌ల వలలో పడిపోకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ‘‘మీ పేటీఎం అకౌంట్‌ బ్లాకింగ్‌కు సంబంధించి లేదా కేవైసీ చేయాలని కోరుతూ ఎటువంటి మెస్సేజ్‌ వచ్చినా నమ్మకండి. వీరంతా మోసగాళ్లు’’ అని ట్విట్టర్‌ వేదికగా శేఖర్‌ శర్మ కోరారు. పేటీఎం కస్టమర్లు కొందరికి మోసగాళ్లు పంపిన ఎస్‌ఎంఎస్‌ ఫొటోను కూడా ఆయన ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు.

‘‘కొంత సమయం పాటు మీ పేటీఎం అకౌంట్లోని నగదును నిలిపివేస్తున్నాం. పేటీఎం కేవైసీని పూర్తి చేయాల్సి ఉంది’’ అంటూ సంబంధిత ఎస్‌ఎంఎస్‌లో పేర్కొన్న విషయాన్ని ఆయన తెలిపారు. వ్యక్తిగత వివరాలను పొందేందుకు మోసగాళ్లు ఈ పనిచేస్తున్నారని, వారి మోసానికి గురికావద్దని సూచించారు. గడిచిన మూడు నెలల్లో వందలాది పేటీఎం కస్టమర్లు ఈ తరహా ఎస్‌ఎంఎస్‌లను చూసి కంపెనీ సైబర్‌ సెల్‌కు ఫిర్యాదు చేయగా, కొందరు ఆర్‌బీఐ అంబుడ్స్‌మన్‌ దృష్టికి కూడా తీసుకెళ్లారు. కేవైసీ చేసేందుకు గాను మొబైల్‌ లేదా డెస్క్‌టాప్‌ అప్లికేషన్‌ ఇన్‌స్టాల్‌ చేసుకోవాలని కోరడం ద్వారా.. ఒక్కసారి ఇన్‌స్టాల్‌ చేసుకున్న అనంతరం అందులోని డేటాను తస్కరించడంతోపాటు, పేటీఎం వ్యాలెట్‌కు అనుసంధానమైన బ్యాంకు ఖాతా నుంచి నగదును కూడా తరలించుకుపోతారు.

Advertisement
 
Advertisement
Advertisement