సీసీఐ విచారణ ఆదేశాలు కొట్టివేయండి
కర్ణాటక హైకోర్టుకు ఫ్లిప్కార్ట్
న్యూఢిల్లీ: కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) తమపై విచారణ జరపాలంటూ ఇచ్చిన ఆదేశాలను కొట్టివేయాలని కోరుతూ ఈ–కామర్స్ సంస్థ ఫ్లిప్కార్ట్ తాజాగా కర్ణాటక హైకోర్టును ఆశ్రయించింది. వర్తకుల సమాఖ్య (సీఏఐటీ) చేసిన ఆరోపణలే ప్రాతిపదికగా, ఎలాంటి ప్రాథమిక ఆధారాలేమీ లేకుండానే సీసీఐ తమపై దర్యాప్తుకు ఆదేశించిందని ఫ్లిప్కార్ట్ పేర్కొంది. వివరాల్లోకి వెడితే.. ఈ–కామర్స్ సంస్థలు అమెజాన్, ఫ్లిప్కార్ట్లు .. భారీ డిస్కౌంట్లు, ఎక్స్క్లూజివ్ ఒప్పందాలతో పోటీని దెబ్బతీస్తున్నాయని సీఏఐటీ ఆరోపిస్తోంది. దీనికి సంబంధించి సీసీఐ విచారణకు ఆదేశించింది. అయితే, దీనిపై స్టే విధిస్తూ కర్ణాటక హైకోర్టు గతంలో ఆదేశాలిచ్చింది. తాజాగా దర్యాప్తు ఆదేశాలను పూర్తిగా తోసిపుచ్చాలంటూ ఫ్లిప్కార్ట్ న్యాయస్థానాన్ని కోరింది.