హైదరాబాద్లో డేటావిండ్ ప్లాంట్.. | datavind plant in hyderabad | Sakshi
Sakshi News home page

హైదరాబాద్లో డేటావిండ్ ప్లాంట్..

Nov 19 2016 12:52 AM | Updated on Sep 18 2018 6:30 PM

ప్లాంటులో తయారీ విధానాన్ని పరిశీలిస్తున్న కేటీఆర్ - Sakshi

ప్లాంటులో తయారీ విధానాన్ని పరిశీలిస్తున్న కేటీఆర్

మొబైల్స్ తయారీలో ఉన్న డేటావిండ్ హైదరాబాద్‌లో ప్లాంటును ఏర్పాటు చేసింది.

ఏటా 20 లక్షల యూనిట్ల తయారీ
ప్రారంభించిన మంత్రి కేటీఆర్...
టెలికంలోకి రానున్న కంపెనీ

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మొబైల్స్ తయారీలో ఉన్న డేటావిండ్ హైదరాబాద్‌లో ప్లాంటును ఏర్పాటు చేసింది. తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు, కెనడా హై కమిషనర్ నదీర్ పటేల్ ఈ కేంద్రాన్ని శుక్రవారం ప్రారంభించారు. ప్లాంటులో ప్రస్తుతం 500 మంది పని చేస్తున్నారు. 2017 మార్చికల్లా ఉద్యోగుల సంఖ్య రెట్టింపు అవుతుందని ఈ సందర్భంగా కేటీఆర్ తెలిపారు. ఐటీఐ పూర్తి చేసిన అభ్యర్థులను మొబైల్ తయారీ కంపెనీలు నియమించుకోవడం అభినందనీయమని అన్నారు. ‘ రాష్ట్రంలో ఒక లక్షకుపైగా ఐటీఐ అభ్యర్థులు ఉన్నారు. మొబైల్ ఫోన్ల తయారీకి అనుగుణమైన వాతావరణాన్ని కల్పించాం. తెలంగాణ ఎలక్ట్రానిక్ తయారీ విధానం విజయవంతం అరుుంది. మైక్రోమ్యాక్స్, సెల్‌కాన్‌లతోపాటు ఇప్పుడు డేటావిండ్ యూనిట్ ఏర్పాటైంది. టీవీల తయారీలో ఉన్న  థామ్సన్ సైతం ఇక్కడ అడుగు పెట్టబోతోంది’ అని ఆయన గుర్తు చేశారు.

 కెనడాకు విమాన సర్వీసులు..
హైదరాబాద్ నుంచి కెనడాకు విమాన సర్వీసులు నడిపేలా ఎరుుర్ కెనడాను ఆదేశించాలని నదీర్ పటేల్‌ను కేటీఆర్ కోరారు. భారత పర్యటనలో భాగంగా కెనడా ప్రధానిని తెలంగాణకు తీసుకు రావాల్సిందిగా విన్నవించారు. ఆ దేశానికి చెందిన 40కి పైగా కంపెనీలు ఈ రాష్ట్రంలో ఉన్నాయని గుర్తు చేశారు. డిజిటల్ అక్షరాస్యత కార్యక్రమంలో భాగంగా కంటెంట్, ట్యాబ్లెట్స్, టూల్స్ అవసరమని, ఈ విషయంలో డేటావిండ్ మద్ధతు ఇవ్వొచ్చని చెప్పారు.

 దశలవారీగా రూ.100 కోట్లు..
డేటావిండ్ 20 లక్షల యూనిట్ల వార్షిక తయారీ సామర్థ్యంతో శంషాబాద్‌లోని జీఎంఆర్ కాంప్లెక్స్‌లో తయారీ కేంద్రం నెలకొల్పింది. దశలవారీగా రూ.100 కోట్లను వెచ్చించనున్నట్టు కంపెనీ సీఈవో సునీత్ సింగ్ తులి పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇక్కడే భారీ కాంప్లెక్సును ఏర్పాటు చేస్తామన్నారు. ప్లాంటులో మినీ ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్లెట్ పీసీలు, మొబైల్ ఫోన్లను రూపొందిస్తారు.

 టెలికంలోకి డేటావిండ్..
దేశంలో టెలికం సేవలు అందించేందుకు వర్చువల్ నెట్‌వర్క్ ఆపరేటర్ (వీఎన్‌వో) లెసైన్సుకు దరఖాస్తు చేసుకున్నట్టు డేటావిండ్ వెల్లడించింది. ఈ సర్వీసులకై  రూ.80 కోట్లదాకా వెచ్చించనున్నట్టు సీఈవో వెల్లడించారు. సొంతంగా సిమ్‌ల జారీతోపాటు రూ.20లకే అన్‌లిమిటెడ్ బ్రౌజింగ్ ప్లాన్‌లను అందిస్తామన్నారు. స్పెక్ట్రమ్ కొనుగోలు చేయబోమని స్పష్టం చేశారు. ఒక టెలికం కంపెనీతో చేతులు కలిపి సేవలు ప్రారంభిస్తామని పేర్కొన్నారు. టెలికం సర్వీసులు అందించే సంస్థలకు రిటైలర్లుగా వీఎన్‌వోలు వ్యవహరిస్తారుు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement