ఆ అవ్వ వ్యాపారంలో పెట్టుబడి పెడతా!

Anand Mahindra Wants To Invest In Tamilnadu Elderly Women Business - Sakshi

న్యూఢిల్లీ : రూపాయికే ఇడ్లీతో పాటు రుచికరమైన సాంబారు కూడా అందించే అవ్వ కమలాతాళ్‌ ఎంతో గొప్ప వ్యక్తి అంటూ పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్ర ప్రశంసలు కురిపించారు. ఇలాంటి వ్యక్తుల కథ తెలుసుకున్నప్పుడు ఆశ్చర్యకరంగా ఉండటంతో పాటు వారికి సహాయపడితే బాగుండు అనిపిస్తుందన్నారు. అందుకే కట్టెల పొయ్యి నుంచి వచ్చే పొగతో సతమతమవుతున్న ఆ అవ్వ వ్యాపారంలో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నానని తెలిపారు. ఆమె గురించి తెలిసిన వారు వివరాలు తెలియజేస్తే తనకు ఓ ఎల్పీజీ స్టవ్‌ కొనిస్తానని తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. కాగా ఆనంద్‌ మహీంద్ర సోషల్‌ మీడియాలో యాక్టివ్‌ ఉంటారన్న సంగతి తెలిసిందే.

చదవండి : మా మంచి అవ్వ..రూపాయికే ఇడ్లీ!

ఈ క్రమంలో ఆయన ట్వీట్‌పై అధిక సంఖ్యలో నెటిజన్లు స్పందించారు. కొంతమంది ఈ విషయంలో ఆయనకు మద్దతు పలకగా.. మరికొంత మాత్రం.. ‘అవ్వ బిజినెస్‌ చేయడం లేదు. సేవ మాత్రమే చేస్తుందని’ కామెంట్‌ చేశారు. ఇందుకు స్పందనగా..‘తన పేరును లాక్కోవాలని అనుకోవడం లేదు. పొగ ఆమె ఆరోగ్యానికి మంచిది కాదు. అంతేకాదు కేవలం స్టవ్‌ కొనివ్వడం వరకే పరిమితం కాను. తనకు నిరంతరాయంగా గ్యాస్‌ సిలిండర్‌ సరఫరా చేసేలా మా టీమ్‌కు చెప్తాను. ఆ తర్వాత ఆమె ఇష్టం’ అని మహీంద్ర మరో ట్వీట్‌లో పేర్కొన్నారు. ఇక తమిళనాడులోని పెరూర్‌కి దగ్గరలో ఉన్న వడివేలయంపాలయం గ్రామంలో నివసించే కమలాతాళ్‌ ఎనిమిది పదుల వయస్సులోనూ సేవాభావం చాటుకుంటున్న సంగతి తెలిసిందే. ఉదయం ఆరింటికే తన ఇంటి వద్ద ఇడ్లీ కోసం వేచి చూస్తున్న వారందరినీ ఆప్యాయంగా పలకరిస్తూనే.. వేడి వేడి ఇడ్లీ, ఘుమఘుమలాడే సాంబారు, రుచికరమైన చట్నీ అందచేస్తుంది ఆమె. అవ్వ దగ్గర ఒక ఇడ్లీ కేవలం ఒక రూపాయికి మాత్రమే లభిస్తుంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top