మిలీనియర్స్‌గా మారిన పేటీఎం ఉద్యోగులు | Sakshi
Sakshi News home page

మిలీనియర్స్‌గా మారిన పేటీఎం ఉద్యోగులు

Published Mon, Jan 29 2018 9:01 AM

పేటీఎం సంస్థలో పనిచేసే ఉద్యోగులు(ఫైల్‌)  - Sakshi

ముంబై : పెద్ద నోట్ల రద్దు తర్వాత డిజిటల్‌ లావాదేవీలు విపరీతంగా పెరగడంతో, కేవలం పేటీఎం బాస్‌ విజయ్‌ శేఖర్‌ శర్మ మాత్రమే బిలీనియర్‌ కాలేదు. ఆ కంపెనీ మాజీ ఉద్యోగులు, ప్రస్తుత ఉద్యోగులు కూడా మిలీనియర్లుగా మారిపోయారు. సంస్థకు చెందిన మాజీ, ప్రస్తుత ఉద్యోగులు 200 మంది రూ.5 బిలియన్లకు ధనవంతులైనట్టు కంపెనీ తెలిపింది.  కంపెనీ ఇటీవల ప్రకటించిన రెండో షేరు విక్రయంతో, కంపెనీ విలువ రూ.635.8 బిలియన్లకు చేరుకుంది. దీంతో పేటీఎం ఉద్యోగులు తమ ఎంప్లాయీ స్టాక్‌ ఓనర్‌షిప్‌ ప్లాన్‌(ఈఎస్‌ఓపీ)ను నగదుగా మార్చుకునేందుకు అవకాశం లభించింది. ఇలా నగదుగా మార్చుకున్న క్రమంలో ఉద్యోగులు మొత్తం రూ.5 బిలియన్లను ఆర్జించినట్టు తెలిసింది. కంపెనీలో షేర్లను ఉద్యోగులు కొనుగోలుచేసేందుకు ఈఎస్‌ఓపీ ఒక ప్రయోజనకర ప్లాన్‌. 

2017 మే నాటికి పేటీఎం విలువ రూ.445.09 బిలియన్లుగా ఉంది. అయితే రెండోసారి విక్రయించిన షేర్లలో కంపెనీ విలువ రూ.635.8 బిలియన్లకు పెరిగింది. బిజినెస్‌, టెక్నాలజీ, ప్రొడక్ట్‌, అడ్మినిస్ట్రేటివ్‌, హ్యుమన్‌ రిసోర్సస్‌, సేల్స్‌, ఫైనాన్స్‌లలో పనిచేసే, పనిచేసిన 200 మంది పేటీఎం ఉద్యోగులకు రెండోసారి విక్రయం ద్వారా రూ.5 బిలియన్ల విలువైన షేర్లను లిక్విడిటీ మార్చుకునే అవకాశం కల్పించినట్టు కంపెనీ పేర్కొంది. దీనిలో చాలా మంది ఉద్యోగులు కంపెనీ ప్రారంభించినప్పటి నుంచి ఉన్నవారే. గతేడాది డిసెంబర్‌లో ఆన్‌లైన్‌ మార్కెట్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌ కూడా రూ.6.5 బిలియన్ల విలువైన ఈఎస్‌ఓపీలను బైబ్యాక్‌ చేసింది. మొబైల్‌-ఫస్ట్‌ ఫైనాన్సియల్‌ సర్వీసెస్‌ సంస్థ అయిన పేటీఎంను, వన్‌97 కమ్యూనికేషన్‌ లిమిటెడ్‌ నడిపిస్తోంది.

Advertisement
Advertisement