
రెనో కార్ల ధరలు 2.5 శాతం పెంపు
రేనో ఇండియా కంపెనీ తన కార్ల ధరలను రెండున్నర శాతం వరకూ పెంచుతోంది.
న్యూఢిల్లీ: రేనో ఇండియా కంపెనీ తన కార్ల ధరలను రెండున్నర శాతం వరకూ పెంచుతోంది. పెరుగుతున్న ఉత్పత్తి వ్యయాలను కొంచెమైనా తట్టుకునేందుకు ధరలను పెంచక తప్పడం లేదని రెనో ఇండియా వైస్ ప్రెసిడెంట్ (సేల్స్ అండ్ మార్కెటింగ్) రాఫెల్ ట్రెగర్ చెప్పారు. ధరల పెరుగుదల వచ్చే నెల 1 నుంచి వర్తిస్తుందని పేర్కొన్నారు.
ఇప్పటివరకూ ఉత్పత్తి వ్యయాల పెంపును తట్టుకోగలిగామని, కానీ ముడి సరుకుల ధరలు పెరుగుతున్నందున కార్ల ధరలను పెంచక తప్ప డం లేదని వివరించారు. ఉత్పత్తి వ్యయాలు పెరుగుతున్నాయంటూ ఇప్పటికే పలు కార్ల కంపెనీలు ధరలను పెంచాయి. నిస్సాన్ ఇండియా రూ.18,000 వరకూ, మారుతీ సుజుకి 2-4 శాతం వరకూ, హ్యుందాయ్ రూ.25,000 వరకూ, బీఎండబ్ల్యూ 5 శాతం వరకూ పెంచాయి. జనరల్ మోటార్స్, టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీలు కూడా ధరలను పెంచాయి.