‘టీడీపీ నేతలు పందికొక్కుల్లా తిన్నారు’ | YSRCP leader Ambati Rambabu Fires On Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

టీడీపీ నేతలు పందికొక్కుల్లా తిన్నారు

May 21 2019 1:56 PM | Updated on May 21 2019 4:26 PM

YSRCP leader Ambati Rambabu Fires On Chandrababu Naidu - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే టీడీపీ నేతల అవినీతి స్కాంలను బయటపెడతామని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. ఐదేళ్ల పాలనలో వ్యవస్థల్నీ చంద్రబాబు  భ్రష్టు పట్టించారని ఆరోపించారు. గత కొంతకాలంగా ఆయన ప్రవర్తన విచిత్రంగా ఉందని, అధికారులు, ఈవీఎం, వీవీప్యాట్ల అంశాలపై తగాదా పెట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు. దుర్మార్గమైన పాలనకు వ్యతిరేకంగా ప్రజలు ఓటేశారని, ఎగ్జిట్‌ పోల్స్‌ను చూసే చంద్రబాబుకు వణుకుపుట్టిందని అంబటి అభిప్రాయపడ్డారు. మే 23న ఫలితాలు చూస్తే తట్టుకోలేరన్నారు. కేంద్రంలో తమ పాత్ర ఏంటో మే 23 తరువాత వెల్లడిస్తామని స్పష్టంచేశారు. ఎన్నికల్లో ఓటమి సహజమేనని, ఓడినప్పుడు కూడా హుందాగా ఉండాలని హితవుపలికారు. తుంటరి ఆటగాళ్ల స్థాయికి చంద్రబాబు దిగజారిపోయారని విమర్శించారు. మంగళవారం ఆయన మీడియా సమావేశం నిర్వహించి పలు అంశాలపై చర్చించారు.

సమావేశంలో అంబటి మాట్లాడుతూ.. ‘‘చంద్రబాబుకి నూటికి వెయ్యి శాతం గెలుస్తామని చెప్పుకోవాల్సిన దుస్థితి ఎందుకు వచ్చింది. పోలింగ్ తర్వాత బాబు చిత్రవిచిత్రంగా ప్రవరిస్తున్నాడు. ప్రతీ అంశంపై నానా యాగీ చెస్తున్నారు. వీవీప్యాట్‌ అంశంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అయినా కూడా చంద్రబాబు ఎందుకింత ఫ్రస్టేషన్‌కి గురవుతున్నారు. చంద్రబాబుకు ఏ వ్యవస్థపై నమ్మకం లేదు. 23న వచ్చే ఫలితాలును కూడా చంద్రబాబు నమ్మేలా లేరు. ఈసీపై మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ మంచి వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు గెలిచినప్పుడు ఇవే ఈవీఎంలుకదా. ఓటమి అంగీకరించలేక ఈవీఎంలపై నెపం నెట్టే ప్రయత్నం చేస్తున్నారు.

సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

కౌంటింగ్ కేంద్రం వద్ద టీడీపీ నేతలు అల్లర్లు సృష్టిస్తే ఈసీ వెంటనే చర్యలు తీసుకోవాలి. చంద్రబాబు ఢిల్లీ వెళ్లి ధర్నా చేయడం ఏంటి?. కోర్ట్ స్పష్టంగా చెప్పినా ధర్నా చేస్తారా. సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసినా మారరా?. బుద్దా వెంకన్న తొడ కొట్టి సవాలు చేస్తున్నారు. తొడలు కొట్టినోళ్లు రాజకీయాల్లో ఎక్కువ కాలం ఉన్న చరిత్ర లేదు. టీడీపీ నేతలు పందికొక్కుల్లా తిన్నారు.. అదంతా కక్కిస్తాం. శరద్  పవార్‌ ఫోన్ ఊహాగానాలే. జాతీయ రాజకీయాల్లో మా పాత్ర 23 సాయంత్రం క్లారిటీ వస్తుంది. రాష్ట్ర ప్రయోజనాలే మాకు ముఖ్యం’’ అని వ్యాఖ్యానించారు. 


 

Advertisement
 
Advertisement
Advertisement