పాదయాత్ర చేయనున్న వైవీ సుబ్బారెడ్డి

YSRCP Former MP YV Subba Reddy Ready For Padayatra - Sakshi

సాక్షి, ప్రకాశం : వెలిగొండ ప్రాజెక్టుపై టీడీపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి విమర్శించారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా పాదయాత్ర చేయనున్నట్లు ఆదివారం ఆయన ప్రకటించారు. ఈ మేరకు పాదయాత్ర రూట్‌మ్యాప్‌ను వైఎస్సార్‌సీపీ నేతలు సమావేశమై ఖరారు చేశారు. ఈ సమావేశంలో వైవీ సుబ్బారెడ్డి, మాజీమంత్రి బాలినేని శ్రీనివాస్‌ రెడ్డి, వైఎస్సార్‌సీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. వెలిగొండ ప్రాజెక్టు కోసం జిల్లా ప్రజలు వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారని తెలిపారు. వైఎస్సార్‌ ప్రభుత్వంలోనే వెలిగొండ 70శాతం పనులు పూర్తయ్యాయని, చంద్రబాబు వచ్చాక ప్రాజెక్టును నిర్లక్ష్యం చేశారన్నారు. ప్రాజెక్టు పూర్తి చేసే గడువు ప్రతి ఏడూ చంద్రబాబు మార్చుకుంటూనే ఉన్నారని ఎద్దేవా చేశారు. జిల్లా ప్రజలు తాగు నీటి కోసం అల్లాడుతున్నారని వివరించారు. చంద్రబాబు ఎన్నిసార్లు జిల్లా ప్రజలను మోసం చేస్తారని ప్రశ్నించారు. సంక్రాంతి కానుకగా వెలిగొండ ప్రాజెక్టు ఇస్తా అంటూ జిల్లా ప్రజలను మరోసారి చంద్రబాబు మోసం చేయబోతున్నారని పేర్కొన్నారు.  నాలుగు నెలల్లో ప్రాజెక్టు పూర్తి చేస్తానని చంద్రబాబు పచ్చి అబద్ధాలు చెబుతున్నారని అన్నారు.

వెలిగొండపై రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా మోసం చేస్తోందో ప్రజలకు వివరించేందుకు ఆగస్టు 15 నుంచి పాదయాత్ర చేస్తున్నట్లు తెలిపారు.  జగన్‌ని ఎదుర్కొనే దుమ్ములేకే ఆయన సతీమణిపై టీడీపీ బురద జల్లే ప్రయత్నం చేస్తోందన్నారు. కోర్టులో డాక్యుమెంట్స్‌ దాఖలు చేయకుండానే పచ్చ పత్రికలు ఎలా రాశాయని ప్రశ్నించారు. ఇలాంటి తప్పుడు కేసులకు, బెదిరింపులకు తాము బయపడమని స్పష్టం చేశారు. అన్నీ ఎదుర్కొంటామని, ఎలాంటి కేసులయినా చట్టపరంగా ఎదుర్కొంటామని పేర్కొన్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top