'ప్రజలపై ప్రతీకారం తీర్చుకుంటున్న బాబు' | YSR Congress Party MLA G srikanth reddy takes on Chandrababu naidu | Sakshi
Sakshi News home page

'ప్రజలపై ప్రతీకారం తీర్చుకుంటున్న బాబు'

Sep 26 2014 2:05 PM | Updated on May 25 2018 9:17 PM

'ప్రజలపై ప్రతీకారం తీర్చుకుంటున్న బాబు' - Sakshi

'ప్రజలపై ప్రతీకారం తీర్చుకుంటున్న బాబు'

ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి చంద్రబాబు.. పేద ప్రజలపై ప్రతీకారాన్ని తీర్చుకుంటూ వస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జి.శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు.

హైదరాబాద్: టీడీపీ వ్యవస్థాప అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి చంద్రబాబు.. పేద ప్రజలపై ప్రతీకారాన్ని తీర్చుకుంటూ వస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జి.శ్రీకాంత్ ఆరోపించారు. శుక్రవారం హైదరాబాద్లో పార్టీ కేంద్ర కార్యాలయంలో జి.శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ...చంద్రబాబు అనుసరిస్తున్న వైఖరిపై తీవ్ర స్థాయిలో ధ్వజమేత్తారు. దొంగదారిలోనైనా అధికారంలోకి రావాలని ఎన్నికల్లో హామీలు ఇచ్చారని విమర్శించారు.  

రైతులు, డ్వాక్రా మహిళల రుణాలను సంపూర్ణంగా మాఫీ చేస్తామని చెప్పి... ఇప్పటి వరకు మాఫీ చేయాలేదన్నారు. ఆహార సబ్సిడీల కింద దాదాపు రూ. 4200 కోట్లు అవసరం కాగా... రూ. 2318 కోట్లు మాత్రమే విడుదల చేశారని చెప్పారు. రేషన్ కార్డులు, పింఛన్లపై తీవ్రంగా కోత విధిస్తున్నారన్నారు. పెన్షన్లకు రౌడీషీటర్లనే ఎంపిక చేస్తున్నారని... అలాగే పచ్చచోక్కాలకు మాత్రమే పెన్షన్లు ఇవ్వాలని ఆదేశాలు ఇస్తున్నారని విమర్శించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో తరతమ భేదం లేకుండా పేదలందరికి సంక్షేమ పథకాలు వర్తింప చేశారని గుర్తు చేశారు. చంద్రబాబు అలాకాకుండా ఒకటి, రెండు కారణాలు సాకుగా చూపి లక్షల సంఖ్యలో రేషన్ కార్డులు ఏరివేస్తున్నారని ఆరోపించారు.

గతంలో ఆధార్ కార్డు వద్దని చెప్పిన చంద్రబాబు... ఇప్పుడు ప్రతిదానికి ఆధార్ లింకేజీ చేస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో ఆరోగ్య శ్రీ పథకం ఉండకూడదన్న అభిప్రాయం చంద్రబాబుకు స్పష్టంగా కనబడుతుందని అభిప్రాయపడ్డారు. ప్రతి సంక్షేమ కార్యక్రమానికి మంగళం పలికే ఆలోచనలో చంద్రబాబు ఉన్నట్లుందన్నారు. రాష్ట్రంలో 5 నెలలుగా వేల టన్నుల ఎర్రచందనాన్ని అక్రమంగా తరలిస్తున్నారని... ఆ స్మగ్లింగ్లో టీడీపీ కార్యకర్తలు చాపకింద నీరులా పాలుపంచుకుంటున్నారన్నారు.

రాష్ట్రాన్ని రౌడీ రాజ్యం చేయడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. సంక్షేమ పథకాల ఎంపిక కమిటీల్లోకి సామాజిక కార్యకర్తల ముసుగులో రౌడీలు వస్తున్నారన్నారు. అలిపిరి కేసులో కోర్టు దోషులుగా పేర్కొన్న ముగ్గురిలో ఒకరు టీడీపీ కార్యకర్తే అని ఆయన వివరించారు. కోర్టు దోషిగా పేర్కొన్న నర్సింహారెడ్డి.... చంద్రబాబు ఫొటోలతో ప్రచారంలో పాల్గొన్నారన్నారు. ఈ రోజుకు కూడా నరసింహారెడ్డి టీడీపీ కార్యకర్తగానే కొనసాగుతున్నారని శ్రీకాంత్ రెడ్డి చెప్పారు.   

ప్రజా సంక్షేమానికి చంద్రబాబు పూర్తి వ్యతిరేకని ఆరోపించారు. సంక్షేమానికి తాను వ్యతిరేకమంటూ చంద్రబాబు గతంలో రాసుకున్న మనసులోమాట పుస్తకంలో వివరించిన సంగతిని ఆయన ఈ సందర్బంగా గుర్తు చేశారు. ప్రజలకు సబ్సిడీలు కూడా అవసరం లేదని ఆ పుస్తకంలోనే బాబు వివరించారని చెప్పారు. గతంలో ఆ రోజు చెప్పినట్టుగానే బాబు ఇప్పుడు శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నారని ఆరోపించారు.

Advertisement
 
Advertisement
Advertisement