వైఎస్ఆర్ జయంతికి సేవా కార్యక్రమాలు

మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి - Sakshi


హైదరాబాద్: దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా నగరాలు, పట్టణాలు, గ్రామాలలో సేవా కార్యక్రమాలు చేపట్టాలని వైఎస్ఆర్ సిపి కార్యకర్తలకు పిలుపు ఇచ్చింది. ఈ నెల 8న వైఎస్ఆర్ 65వ జయంతిని పురస్కరించుకొని సేవా కార్యక్రమాలతోపాటు మహానేత విగ్రహాలకు పాలాభిషేకాలు చేయాలని నిర్ణయించారు. వర్షాలు కురవనందున జిల్లా, నియోజకవర్గ కేంద్రాలలో వరుణ యాగాలు నిర్వహించాలని కూడా పార్టీ నాయకులను, కార్యకర్తలను ఓ ప్రకటనలో  వైఎస్ఆర్ సిపి కోరింది.



ఆ మహానేత పేరు తలచుకుంటే ఒక్క పైసా కూడా ఎలాంటి పన్నులు విధించకుండా, ఆర్టీసి, విద్యుత్ ఛార్జీలు పెంచకుండా సాగించిన పాలన గుర్తుకు వస్తోందని ఆ పార్టీ పేర్కొంది. అలాగే ఆరోగ్యశ్రీ, 104, 108, ఫీజురీయింబర్స్మెంట్, 47 లక్షల ఇళ్ల నిర్మాణం వంటి ఇంటింటి పథకాలు అనేకం గుర్తుకువస్తాయని వివరించింది. ఆధునిక సమాజ దేవాలయాలుగా చేపట్టిన అనేక ప్రాజెక్టుల నిర్మాణం గుర్తుకు వస్తాయని ఆ పార్టీ పేర్కొంది. ఏనాటికైనా తెలుగు ప్రజలకు వైఎస్ఆర్ విధానాలే శ్రీరామ రక్ష అని పార్టీ అభిప్రాయపడింది.



వైఎస్ఆర్ పాలనలో ఏటా వర్షాలు పడి రాష్ట్ర చరిత్రలోనే అత్యధికంగా పంటలు పండి రైతులు ఎంతో సంతోషంగా ఉన్నారని గుర్తు చేసింది. జూలై మొదటి వారంలో కూడా ఆంధ్రప్రదేశ్లోని 13 జిల్లాలలో వర్షాలు లేవు. అన్ని జిల్లాలలో 40 డిగ్రీల ఉష్ట్రోగ్రతలు - వడగాల్పులకు మరణాలు నమోదు అవుతున్నాయి. దాంతో జనం ఆ మహానేత పాలనను గుర్తుచేసుకుంటున్నారని పార్టీ తెలిపింది. ఈ పరిస్థితులలో వైఎస్ఆర్ జయంతిని ఘనంగా నిర్వహించాలని, వరుణ యాగాలు నిర్వహించాలని నేతలను, కార్యకర్తలను పార్టీ కోరింది.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top