తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకునేందుకే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ విజయవాడలో దీక్ష తలపెట్టారని తెలంగాణ న్యాయవాదులు ఆరోపించారు.
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకునేందుకే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ విజయవాడలో దీక్ష తలపెట్టారని తెలంగాణ న్యాయవాదులు ఆరోపించారు. దీక్షలు, ఆందోళనల ద్వారా విజయమ్మ బ్లాక్మెయిలింగ్ రాజకీయాలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. ఈ నెల 19 నుంచి విజయవాడలో తలపెట్టిన విజయమ్మ దీక్షకు పోలీసులు అనుమతి ఇవ్వరాదని ఉన్నతాధికారులను కోరారు. ఈ మేరకు శాంతిభద్రతల విభాగం అదనపు డీజీ వీఎస్కే కౌముదిని శనివారం కలసి వినతిపత్రం సమర్పించారు.
అనంతరం న్యాయవాదుల జేఏసీ నేతలు మీడియాతో మాట్లాడుతూ... కేంద్రం ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తున్న తరుణంలో తెలంగాణ ప్రజల మనోభావాలను కించపరిచేలా వైఎస్సార్సీపీ వ్యవహరిస్తోందని ఆరోపించారు. తెలంగాణ ప్రజల హక్కులు, ఆకాంక్షలకు వ్యతిరేకంగా సమైక్యవాదం పేరుతో ప్రజలందరూ కలసి ఉండాలని కోరుతున్నారని మండిపడ్డారు. తెలంగాణ ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టేలా విజయవాడలో తలపెట్టిన నిరాహారదీక్షకు అనుమతి నిరాకరించాలని ప్రభుత్వం, పోలీసుశాఖను డిమాండ్ చేశారు. అదనపు డీజీని కలిసిన వారిలో తెలంగాణ జేఏసీ నేతలు కొంతం గోవర్ధన్రెడ్డి, సీహెచ్ ఉపేంద్ర, సుంకరి జనార్ధనగౌడ్, కోటగిరి శ్రీధర్, ఇంద్రకుమార్లు ఉన్నారు.