256వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం
సాక్షి, పెందుర్తి: ప్రజలతో మమేకమై వారి సమస్యలు తెలుసుకుని.. వారిలో భరోసా నింపేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విశాఖపట్నం జిల్లాలో దిగ్విజయంగా కొనసాగుతోంది. జననేత 256వ రోజు పాదయాత్రను గురువారం ఉదయం పెందుర్తి నియోజకవర్గం చిన్నగొల్లలపాలెం క్రాస్ నుంచి ప్రారంభించారు. అక్కడి నుంచి అమృతాపురం, ఇప్పవానిపాలెం మీదుగా జెర్పిపోతుల పాలెం వరకు నేటి పాదయాత్ర కొనసాగనుంది.
తమ బతుకుల్లో నవ్వుల పువ్వులు విరిసేలా చేయాలన్న సంకల్పంతో సుదీర్ఘ పాదయాత్ర సాగిస్తున్న జనపథికుడిను కలిసేందుకు ఉదయం నుంచే పెద్ద ఎత్తున అభిమానులు, పార్టీ కార్యకర్తలు, ప్రజలు నైట్ క్యాంప్కు తరలివచ్చారు. జననేత సంకల్ప సిద్ధి విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ స్థానిక ప్రజలు సర్వమత ప్రార్థనలు జరిపించారు. ప్రజాసమస్యలు తెలుసుకుంటూ.. వారికి నేనున్నా అని భరోసానిస్తూ వైఎస్ జగన్ పాదయాత్రలో అడుగులు ముందుకు వేస్తున్నారు. ఇప్పటివరకు జననేత ప్రజాసంకల్పయాత్రలో భాగంగా 2,904.3 కిలోమీటర్లు నడిచారు.