కావలి పట్టణంలో ఆర్యవైశ్య ఓటర్ల మీద గురిపెట్టిన కాంగ్రెస్ పార్టీ మాజీ కౌన్సిలర్ అమర యాదగిరి గుప్తను పోటీకి దించాలనే ప్రయత్నం చేసింది.
కావలి నుంచి పోటీచేయాలని ఒత్తిడి
ఈ గొడవ తమకొద్దని తిరస్కరించిన యాదగిరి
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: కావలి పట్టణంలో ఆర్యవైశ్య ఓటర్ల మీద గురిపెట్టిన కాంగ్రెస్ పార్టీ మాజీ కౌన్సిలర్ అమర యాదగిరి గుప్తను పోటీకి దించాలనే ప్రయత్నం చేసింది. ఈ ఆఫర్ను ఆయన సున్నితంగా తిరస్కరించినట్లు సమాచారం. రాష్ట్ర విభజనకు కాంగ్రెస్ పార్టీ అనుకూల నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో కావలి నియోజకవర్గంలో ఆ పార్టీకి దిక్కు లేకుండా పోయింది.
మాజీ శాసనసభ్యుడు విష్ణువర్ధన్రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ గంధి యానాదిశెట్టి లాంటి వారంతా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కావలి పట్టణంలో వైశ్య సామాజికవర్గం ఓట్లు పెద్దసంఖ్యలో ఉండటంతో ఆ సామాజికవర్గానికే చెందిన యాదగిరి గుప్తను పోటీ చేయిస్తే వైఎస్సార్సీపీ ఓట్లను నిలువరించవచ్చనే అంచనాతో కాంగ్రెస్ పార్టీ ఆలోచించింది. మాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి స్వయంగా యాదగిరికి ఫోన్ చేసి పోటీకి సిద్ధం కావాలని కోరారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో తాము పోటీ చేయలేమని, తమ కుటుంబానికి కూడా అలాంటి ఆలోచన లేదని తెగేసి చెప్పినట్లు సమాచారం. యాదగిరి కాదనడంతో కాంగ్రెస్ పార్టీ మరో వ్యక్తి కోసం అన్వేషణలో పడినట్లు తెలిసింది.