మండల కేంద్రానికి చెందిన లాలమ్మల అరుణ(23) చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున మృతిచెందింది. ఎస్సై రాంబాబు వివరాల ప్రకారం...
తాడ్వాయి న్యూస్లైన్ : మండల కేంద్రానికి చెందిన లాలమ్మల అరుణ(23) చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున మృతిచెందింది. ఎస్సై రాంబాబు వివరాల ప్రకారం... తాడ్వాయికి చెందిన లాలమ్మల స్వామి, నర్సవ్వల కూతురైన లాలమ్మల అరుణను మాచారెడ్డి మండలం ఇసాయిపేట్ గ్రామానికి చెందిన నామల నారాయణ, బాలమణిల మొదటి కుమారుడైన ప్రవీణ్తో 25, ఏప్రిల్ 2013లో వివాహం జరిపించారు.వివాహ సమయంలో రూ.2 లక్షలు, బైకు, 3 తులాల బంగారం వరకట్నంగా ఇచ్చారు. నెల పాటు వారిద్దరి కాపురం సాఫీగానే సాగింది. కాగా నిజామాబాద్లో గల అరుణ అమ్మమ్మ ఇంటిని అమ్మి తనకు అదనంగా కట్నం ఇవ్వాలని ప్రవీణ్ తరచూ భార్యను చితకబాదేవాడు.
అదనపు కట్నం కోసం అత్త బాలమణి, మామ నారాయణ అరుణను తరుచూ వేధించేవారు. ఈ బాధలు భరించలేక 15 రోజుల క్రితం పుట్టింటికి వచ్చి న అరుణ, ఈనెల 13న సూసైడ్ నోట్ రాసి ఇంట్లో ఎవరూ లేని సమయంలో గడ్డిమందు తాగి ఆత్మహత్య కు పాల్పడింది. అపస్మారక స్థితిలో ఉన్న అరుణను కుటుంబసభ్యులు చికిత్స నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో అదే రోజు హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు.అక్కడ చికిత్స పొందుతూ శనివారం తెల్లవారుజామున మృతిచెందింది. అరుణ చావుకు కారకులైన భర్త , అత్తమామలపై పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్ట్మార్టానికి తరలించారు.