
ప్రియుడితో కలిసి భర్త హత్య
వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఓ మహిళ కట్టుకున్న భర్తను ప్రియుడితో కలిసి చంపించింది.
మొయినాబాద్, న్యూస్లైన్: వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని ఓ మహిళ కట్టుకున్న భర్తను ప్రియుడితో కలిసి చంపించింది. అనంతరం అతడితో కలిసి పరారైంది. పోలీసులు శుక్రవారం నిందితులను పట్టుకొని రిమాండుకు తరలించారు. గత నెలలో జరిగిన వ్యక్తి హత్య మిస్టరీని మొయినాబాద్ పోలీసులు ఛేదించారు. శుక్రవారం స్థానిక ఠాణాలో రాజేంద్రనగర్ ఏసీపీ ముత్యంరెడ్డి, సీఐ రవిచంద్ర విలేకరులకు కేసు వివరాలు వెల్లడించారు.
తూర్పుగోదావరి జిల్లా గంగవరం మండలం నల్లచెరువుపుంత గ్రామానికి చెందిన రాయుడు సోమరాజు(30), కనకదుర్గాదేవి దంపతులు తమ ఇద్దరు పిల్లలతో కలిసి రాజేంద్రనగర్ మండలం మణికొండకు ఏడాది క్రితం వలస వచ్చారు. పంచవటి కాలనీలోని ఓ అపార్ట్ మెంట్లో సోమరాజు వాచ్మన్గా పనిచేస్తుండగా కనకదుర్గాదేవి అదే అపార్ట్ మెంట్లో పలువురి ఇళ్లల్లో పనిచేస్తోంది.
అదే అపార్ట్ మెంట్లో ఉండే ఓ న్యాయవాది కారును రాజేంద్రనగర్ మండలంలోని సన్సిటీకి చెందిన గౌతంకుమార్ నడుపుతున్నాడు. ఈక్రమంలో కనకదుర్గాదేవి, గౌతంకుమార్ మధ్య పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈ విషయం రాయుడు సోమరాజుకు తెలిసి పలుమార్లు భార్యను మందలించినా ఫలితం లేకుండా పోయింది.
అడ్డుగా ఉన్నాడని ప్రియుడితో కలిసి హత్య
తమ ‘సంబంధా’నికి సోమరాజు అడ్డుగా ఉన్నాడని కనకదుర్గాదేవి ప్రియుడు గౌతంకుమార్కు చెప్పింది. దీంతో ఎలాగైనా సోమరాజు అడ్డు తొలగించుకోవాలని పథకం వేశారు. మహబూబ్నగర్ జిల్లా దౌల్తాబాద్ మండలం చంద్రకల్ గ్రామానికి చెందిన తుప్పుడు గోపాల్(50) తన భార్యాపిల్లలతో హైదరాబాద్ లంగర్హౌస్లోని జ్యోతినగర్లో ఉంటున్నాడు. గోపాల్ భార్య సన్సిటీలో ఉండే గౌతంకుమార్ ఇంట్లో పనిచేస్తోంది. ఈక్రమంలో గోపాల్తో గౌతంకుమార్కు పరిచయం ఏర్పడింది. గతనెల సెప్టెంబర్ 2న గౌతంకుమార్ రూ.3000 గోపాల్కు ఇచ్చి సోమరాజు హత్యకు సహకరించాలని కోరాడు.
అదేరోజు మద్యం తాగుదామని ఇద్దరూ కలిసి సోమరాజును సన్సిటీకి తీసుకొచ్చారు. బండ్లగూడ సమీపంలో కూర్చుని మద్యం తాగారు. అనంతరం మొయినాబాద్ వైపు తీసుకొచ్చి అజీజ్నగర్ వద్ద తిరిగి మద్యం తీసుకొని ముర్తూజగూడ సమీపంలో సురంగల్ రెవెన్యూలోని నిర్మానుష్య ప్రాంతానికి వెళ్లారు. మద్యం తాగిన తర్వాత గౌతంకుమార్ సోమరాజు గొతునులమడంతో అతడు కిందపడిపోయాడు. వెంటనే గోపాల్ ఓ రాయితో సోమరాజు తలపై మోదాడు. ఆ తర్వాత గౌతంకుమార్ రాయితో బాది సోమరాజును చంపేశాడు. హత్య తర్వాత ప్రియుడితో కలిసి పరారీ భర్త హత్య జరిగిన తర్వాత కనకదుర్గాదేవి గౌతంకుమార్తో కలిసి విశాఖపట్నం పరారైంది. అదే రోజు స్థానికుల సమాచారంతో పోలీసులు ముర్తూజగూడ సమీపంలోని ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకున్నారు.
అదేరోజు తన కుమారుడు కనిపించడం లేదని సోమరాజు తండ్రి వెంకటేశ్వరరావు రాయదుర్గం ఠాణాలో ఫిర్యాదు చేశాడు. రెండు చోట్ల కేసులు నమోదు కావడంతో హతుడు సోమరాజేనని పోలీసులు గుర్తించారు. అప్పటికే కనకదుర్గాదేవి, గౌతంకుమార్లు అదృశ్యమవడంతో వారే సోమరాజును హత్య చేసి ఉంటారని పోలీసులు, కుటుంబీకులు అనుమానించారు. శుక్రవారం నిందితులు రాజేంద్రనగర్ డివిజన్ పరిధిలోని ఆరాంఘర్ చౌరస్తాలో అనుమానాస్పదంగా కనిపించడంతో మొయినాబాద్ పోలీసులు వలపన్ని పట్టుకొని ఠాణాకు తరలించి తమదైన శైలిలో విచారించగా నేరం అంగీకరించాడు. శుక్రవారం సాయంత్రం కనకమహాలకిష్మ, గౌతంకుమార్లతో పాటు గోపాల్ను రిమాండ్కు తరలించారు. కేసు దర్యాప్తులో కీలకంగా పనిచేసిన కానిస్టేబుళ్లు కృష్ణ, నర్సింహగౌడ్ను ఏసీపీ ముత్యంరెడ్డి అభినందించారు.