ఓటర్ల తుది జాబితాను శుక్రవారం జిల్లా యంత్రాంగం ప్రకటించనుంది. గత ఏడాది నవంబర్ 19వ తేదీ ఓటర్ల ముసాయిదా జాబితా ప్రకటించింది.
కూడికలు తీసివేతల్లో పార్టీలు
ఒంగోలు కలెక్టరేట్, న్యూస్లైన్:
ఓటర్ల తుది జాబితాను శుక్రవారం జిల్లా యంత్రాంగం ప్రకటించనుంది. గత ఏడాది నవంబర్ 19వ తేదీ ఓటర్ల ముసాయిదా జాబితా ప్రకటించింది. అదే సమయంలో 2014 జనవరి 1నాటికి 18 సంవత్సరాలు నిండిన వారంతా ఓటర్లుగా నమోదు చేసుకోవచ్చని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ముసాయిదా జాబితాలో జిల్లాలో 23 లక్షల 15 వేల 407 మంది ఓటర్లుగా తేలారు. జనవరి 16వ తేదీ ఓటర్ల తుది జాబితా ప్రకటిస్తామని ముందుగానే ప్రకటించారు. అందుకోసం నవంబర్ 24, డిసెంబర్ 1, 8, 15, 22 తేదీల్లో ప్రత్యేక ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు.
జిల్లాలోని 2751 పోలింగ్ కేంద్రాల్లో ఓటర్ల నమోదు ప్రక్రియ నిర్వహించారు. జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈనెల 24వ తేదీ జిల్లాలో ఓటర్ల జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. 23 లక్షల 15 వేల 407 మంది ఓటర్లు ఉన్నట్లు తేల్చారు. గత జాబితాతో పోల్చుకుంటే కొత్తగా 2 లక్షల 7 వేల 19మంది ఓటర్లుగా చేరారు. అదే సమయంలో 73,121 మంది ఓటర్లను జాబితా నుంచి తొలగించడం జిల్లాలోని అన్ని రాజకీయ పార్టీలను కలవరపాటుకు గురిచేసింది. శుక్రవారం ప్రకటించనున్న ఓటర్ల తుది జాబితాపై రాజకీయ పార్టీలు దృష్టి సారించాయి. నియోజకవర్గాల వారీగా ఎంతమంది కొత్తగా ఓటు హక్కు పొందారు, ఎంతమంది ఓటు హక్కును కోల్పోయారన్న లెక్కలు వేసుకుంటున్నారు. తాజాగా ప్రకటించనున్న ఓటర్ల జాబితాను ఆధారం చేసుకొని త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపధ్యంలో ప్రాధాన్యతను సంతరించుకొంది.