తెలంగాణ ఆర్టీసీ ప్రభావం ఏపీపై ఉండదు: పేర్ని నాని
సాక్షి, అమరావతి : తెలంగాణ ఆర్టీసీ కేంద్రంగా జరుగుతున్న పరిణామాల ప్రభావం ఆంధ్రప్రదేశ్పై ఉండదని రవాణా శాఖ మంత్రి పేర్ని నాని వెల్లడించారు. గురువారం మీడియాతో చిట్చాట్ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన ఏపీలో ఆర్టీసీ విలీనానికి ఎలాంటి ఇబ్బంది ఉండదని స్పష్టం చేశారు. ఏపీలో కార్మికుల విలీనానికి ఆర్టీసీ బోర్డు అంగీకరించిందని, బోర్డులో ఉన్న కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి కూడా విలీనానికి అంగీకరించారని తెలిపారు. ఆర్టీసీ విభజన జరగలేదని తెలంగాణ హైకోర్టులో కేంద్రం చెప్పిన విషయం ప్రస్తావించగా.. విభజన జరగకపోతే ఏపీ, తెలంగాణలలో ఎలక్ట్రిక్ బస్సుల కొనుగోలుకు కేంద్రం విడివిడిగా ఎలా నిధులు కేటాయించిందని ప్రశ్నించారు.
విభజన అనేది సాంకేతిక అంశమన్న మంత్రి.. త్వరలో ఆ ఇబ్బందులను అధిగమిస్తామని తెలియజేశారు. మరోవైపు మాజీ మంత్రి, టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి అంశాన్ని లేవనెత్తగా ‘రాజకీయంగా చివరి దశలో ఉన్న జేసీతో మాకేం పని? ఆయనను వైఎస్సార్సీపీలోకి ఎవరు ఆహ్వానించారు. బస్సుల సీజ్ విషయంలో జేసీ అబద్ధాలు మాట్లాడుతున్నారు. ప్రభుత్వం చట్టప్రకారమే వ్యవహరిస్తుంద’ని వ్యాఖ్యానించారు.