రాజధాని పేరుతో 'రియల్' వ్యాపారం | The name of the capital of the 'real' business | Sakshi
Sakshi News home page

రాజధాని పేరుతో 'రియల్' వ్యాపారం

Mar 7 2015 3:32 AM | Updated on Jul 25 2018 4:09 PM

రాజధాని పేరుతో 'రియల్' వ్యాపారం - Sakshi

రాజధాని పేరుతో 'రియల్' వ్యాపారం

రాజధాని నిర్మాణానికి మంగళగిరిలో ఉన్న రెండు మూడు వేల ఎకరాల ప్రభుత్వ భూములు సరిపోతాయని, మూడు పంటలు పండే రైతుల భూములు లాగేసుకోనక్కరలేదని వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు.

రాజమండ్రి/ భీమవరం:  రాజధాని నిర్మాణానికి మంగళగిరిలో ఉన్న రెండు మూడు వేల ఎకరాల ప్రభుత్వ భూములు సరిపోతాయని, మూడు పంటలు పండే రైతుల భూములు లాగేసుకోనక్కరలేదని వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. రాజధాని పేరిట రైతుల పంట పొలాలతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని ప్రోత్సహించడం చాలా దారుణమన్నారు. ‘బుద్ధున్న వారెవరైనా మూడు పంటలు పండే భూములను రాజధాని కోసం రైతుల నుంచి లాక్కుంటారా?’ అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజల చిరకాల స్వప్నమైన పోలవరం ప్రాజెక్టు నిర్మాణం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయమని జగన్ తెలిపారు. వైఎస్ ఆశయ సాధన కోసం పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయ్యే వరకు పోరాడతామని స్పష్టం చేశారు.

మాజీ మంత్రి దివంగత జక్కంపూడి రామ్మోహనరావు, పార్టీ సీజీసీ సభ్యురాలు విజయలక్ష్మిల జ్యేష్ట పుత్రుడు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి అయిన రాజా వివాహం సందర్భంగా.. జగన్ శుక్రవారం తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రికి వచ్చారు. ఉదయం హైదరాబాద్ నుంచి విమానంలో బయలుదేరిన ఆయన 10 గంటలకు మధురపూడి విమానాశ్రయం చేరుకుని, అక్కడి నుంచి రాజమండ్రి ప్రకాష్‌నగర్‌లోని జక్కంపూడి నివాసానికి వచ్చారు. రాజాను ఆశీర్వదించి, శుభాకాంక్షలు తెలిపారు. జక్కంపూడి కుటుంబంతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. అనంతరం పశ్చిమ గోదావరి జిల్లా  భీమవరం బయలుదేరి వెళ్లారు. అక్కడ అనంతపురం జిల్లా రాయదుర్గం మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి కుమారుడు ప్రవీణ్‌రెడ్డి, రెడ్డి గ్రూపు సంస్థల యజమాని గొలుగూరి శ్రీరామరెడ్డి కుమార్తె లేఖ్యరెడ్డి వివాహ కార్యక్రమానికి హాజరయ్యారు. వధూవరులను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. రామచంద్రారెడ్డి, భారతి దంపతులు, గొలుగూరి శ్రీరామరెడ్డి కుటుంబసభ్యులతో ముచ్చటించారు.
 
వైఎస్ తప్ప ఏ సీఎం పోలవరాన్ని పట్టించుకోలేదు
రాజమండ్రిలో రాజా నివాసం వద్ద, తర్వాత భీమవరంలో విలేకరులతో మాట్లాడుతూ.. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా పనిచేసిన తర్వాత గానీ, అంతకుముందుగానీ ముఖ్యమంత్రులెవరూ పోలవరం ప్రాజెక్టు నిర్మాణం గురించి పట్టించుకోలేదని జగన్ చెప్పా రు. ముఖ్యమంత్రిగా వైఎస్ మాత్రమే రూ.4 వేల కోట్లు ఖర్చుచేసి ప్రాజెక్టు నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారన్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి ఎవరు అడ్డు తగిలినా ప్రజలు క్షమించరన్నారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం కోసం తాను స్వయంగా 100 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన విషయాన్ని గుర్తు చేశారు. గోదావరి జిల్లాలతో పాటు రాష్ట్రానికి అవసరమైన ప్రాజెక్టును పూర్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు. రాజధాని నిర్మాణంపై తమ వైఖరి ఏమిటో చెప్పామని, ఇప్పటికీ అదే మాటై పె నిలబడి ఉన్నామన్నారు.
అసెంబ్లీలో చర్చించేందుకు రాష్ట్రంలో బోలెడు ప్రజా సమస్యలు ఉన్నాయని, తమ పార్టీ వాటిపై చర్చించి, ప్రజలకు న్యాయం జరిగేలా పోరాడుతుందని చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement