ఆఖరి పోరాటం | Telangana: Seemandhra employees to go on indefinite strike from Feb 7,8 | Sakshi
Sakshi News home page

ఆఖరి పోరాటం

Feb 5 2014 1:48 AM | Updated on Sep 2 2017 3:20 AM

ఆఖరి పోరాటం

ఆఖరి పోరాటం

తెలంగాణ బిల్లును పార్లమెం ట్‌లో వ్యతిరేకించాలని డిమాండ్ చేస్తూ బుధవారం అర్ధరాత్రి నుంచి నిరవధిక సమ్మె చేపడుతున్నట్టు సమైక్య

ఏలూరు, న్యూస్‌లైన్ :తెలంగాణ బిల్లును పార్లమెం ట్‌లో వ్యతిరేకించాలని డిమాండ్ చేస్తూ బుధవారం అర్ధరాత్రి నుంచి నిరవధిక సమ్మె చేపడుతున్నట్టు సమైక్య రాష్ట్ర పరి రక్షణ వేదిక ప్రకటించింది. వేదిక, ఏపీ ఎన్జీవో జిల్లా శాఖ అధ్యక్షుడు ఎల్‌వీ సాగర్ తదితరులు మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఉద్యోగ, ఉపాధ్యా య వర్గాలతోపాటు వ్యాపార, విద్యాసంస్థల యాజమాన్యాలు నిరవధిక సమ్మెను జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర పరిరక్షణ కోసం 66 రోజులపాటు అన్నివర్గాలు ఐక్యంగా ఉద్యమించడం వల్లే రాష్ట్ర విభజన బిల్లును పార్లమెంట్‌కు తిప్పిపంపగలి గామని తెలిపారు. అదే స్ఫూర్తితో రాష్ట్రాన్ని యథాతథంగా ఉంచేందుకు అన్నివర్గాల ప్రజలు తుది పోరాటాన్ని విజయవంతం చేయూలని కోరారు. 
 
 ఎన్నికల విధులకు సహకారం అందించేది లేదని స్పష్టం చేశారు.  సమ్మెనుంచి 10వ తరగతి విద్యార్థులను మినహాయిస్తున్నట్టు తెలిపారు. ఈనెల 7, 8, 9 తేదీల్లో ఎంపీలు, కేంద్ర మంత్రుల ఇళ్లను ముట్టడిస్తామని, వారిని అడ్డుకునేందుకు సర్వశక్తులు ఒడ్డుతామని సాగర్ చెప్పారు. సమైక్యాంధ్ర పరిరక్షణ కోసం ఈనెల 9న జిల్లా వ్యాప్తంగా 3కే రన్ నిర్వహిస్తున్నామని తెలిపారు. ఆ రోజు ఏలూరు ఇండోర్ స్టేడియం నుంచి 50 వేలమంది సమైక్యవాదులతో భారీ ప్రదర్శన నిర్వహిస్తామన్నారు. 10న ‘సేవ్ ఆంధ్రప్రదేశ్’ నినాదంతో తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో జరిగే బహిరంగ సభకు సమైక్యవాదులు పెద్దఎత్తున తరలివెళ్లాలని కోరారు. 17, 18 తేదీల్లో ఢిల్లీవెళ్లి అన్ని జాతీయ పార్టీలను కలుస్తామని, రాష్ట్రం సమైక్యంగా ఎందుకు ఉండాలనే విషయూన్ని వివరిస్తామని తెలిపారు.  
 
 కావూరి, కనుమూరి బుద్ధిగా వ్యవహరించాలి
 సమైక్యాంధ్రకు ద్రోహం చేసిన ప్రజాప్రతినిధుల భరతం పడతామని సాగర్ హెచ్చరించారు. కేంద్రమంత్రి కావూరి సాంబశివరావు, ఎంపీ, టీటీడీ చైర్మన్, కను మూరి బాపిరాజు వ్యవహరించిన తీరు ప్రజలకు అర్థమైందన్నారు. పార్లమెంట్‌లో బిల్లు ఆమోదం పొందితే వారి చరిత్ర బయటపడుతుందన్నారు. ప్రజ లు ఎప్పటికీ వారిని క్షమించరని శాపనార్థాలు పెట్టారు. సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక కన్వీనర్ కోనేరు సురేష్‌బాబు, నాయకులు పి.వెంకటేశ్వరరావు, నేరేళ్ల రాజేంద్ర, ఎంబీఎస్ శర్మ, క్రిష్ట్రవరపు వెంకటేశ్వరరావు మాట్లాడుతూ నిరవధిక ఆందోళన కార్యక్రమాలను విజయవంతం చేయడానికి సర్వశక్తులు ఒడ్డాలని కోరారు. ఈనెల 9 నిర్వహించే సమైక్య 3కే రన్‌కు గ్రామాల నుంచి విద్యార్థులు పెద్ద ఎత్తున తరలివచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నామని ఎంబీఎస్ శర్మ వివరించారు. సమావేశంలో ఎన్జీవో నేతలు టి.యోగానందం, ఆర్‌ఎస్ హరనాథ్, నరసింహమూర్తి, చోడగిరి శ్రీనివాస్, కె.రమేష్‌కుమార్, ప్రమోద్, సతీష్ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement