సద్భావనతో కలసి సాగుదాం | Telangana Employees Peace Rally in Secretariat | Sakshi
Sakshi News home page

సద్భావనతో కలసి సాగుదాం

Aug 23 2013 6:08 AM | Updated on Sep 6 2018 3:01 PM

సద్భావనతో కలసి సాగుదాం - Sakshi

సద్భావనతో కలసి సాగుదాం

రాష్ట్రంలోని రెండు ప్రాంతాలకు చెందిన ఉద్యోగుల మధ్య శాంతి, సుహృద్భావ వాతావరణం నెలకొనాలని ఆకాంక్షిస్తూ సచివాలయంలోని తెలంగాణ ఉద్యోగులు గురువారం శాంతి ర్యాలీ నిర్వహించారు.

సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలోని రెండు ప్రాంతాలకు చెందిన ఉద్యోగుల మధ్య శాంతి, సుహృద్భావ వాతావరణం నెలకొనాలని ఆకాంక్షిస్తూ సచివాలయంలోని తెలంగాణ ఉద్యోగులు గురువారం శాంతి ర్యాలీ నిర్వహించారు. శాంతికి చిహ్నంగా తెల్ల బ్యాడ్జీలు కట్టుకుని సచివాలయంలోని ‘కే’ బ్లాకు నుంచి సమతా బ్లాక్ వరకూ మౌనంగా ర్యాలీ నిర్వహించారు. శాంతి కపోతాలను ఎగురవేశారు. ప్రాంతాలుగా విడిపోయినా అన్నదమ్ముల్లా కలసి ఉందామని పిలుపునిచ్చారు. ఉద్యోగులందరం ఆత్మీయంగా, పరస్పర సహకారంతో కొనసాగుదామని, విద్వేషాలు రెచ్చగొట్టవద్దని సూచించారు. ర్యాలీ అనంతరం సచివాలయ తెలంగాణ సమన్వయ సంఘం ప్రధాన కార్యదర్శి నరేందర్‌రావు మీడియాతో మాట్లాడుతూ రెండు ప్రాంతాల ప్రజలు, ఉద్యోగులు శాంతి, సామరస్యాలతో సహకరించుకోవాలని ఆకాంక్షించారు.
 
 రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ఉద్యోగులు సభ్యులుగా ఉన్న ఏపీఎన్జీవోల సంఘం నేతృత్వంలో సమైక్యాంధ్ర ఉద్యమాన్ని సాగిస్తున్న సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబుకు ఏమాత్రం నైతిక విలువలున్నా పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఏపీఎన్జీవోలకు  శాశ్వత గుర్తింపు లేనందున దాన్ని తక్షణమే రద్దు చేయాలన్నారు. సీమాంధ్ర ఉద్యోగులు ఆందోళన చెందుతున్న అంశాలపై కూర్చుని మాట్లాడుకుందామని చర్చలకు ఆహ్వానించారు. సచివాలయ తెలంగాణ జేఏసీ అధ్యక్షుడు శ్రవణ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయితే తమ ప్రాంతానికి వెళ్లిపోతామని చెప్పిన సీమాంధ్ర ఉద్యోగులు ఇప్పుడు మాటమార్చారని తప్పుపట్టారు.

Advertisement
 
Advertisement
Advertisement