సీమాంధ్రలోని అన్ని రాజకీయ పార్టీల నాయకులు ఏకతాటిపైకి వచ్చి సమైక్యాంధ్రకు మద్దతుగా పోరాడాలని సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక ప్రతినిధులు డిమాండ్ చేశారు.
శ్రీకాకుళం అర్బన్, న్యూస్లైన్: సీమాంధ్రలోని అన్ని రాజకీయ పార్టీల నాయకులు ఏకతాటిపైకి వచ్చి సమైక్యాంధ్రకు మద్దతుగా పోరాడాలని సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక ప్రతినిధులు డిమాండ్ చేశారు. సమైక్యాంధ్రకు మద్దతుగా శ్రీకాకుళంలోని వైఎస్ఆర్ కూడలి వద్ద వేదిక ప్రతినిధులు బుధవారం బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం దీక్షా శిబిరం వద్దకు చేరుకుని సమైక్యాంధ్రకు మద్దతుగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వేదిక గౌరవ అధ్యక్షుడు చౌదరి పురుషోత్తమనాయుడు మాట్లాడుతూ సీమాంధ్ర ప్రాంత ఎమ్మెల్యేలంతా పార్టీల జెండాలు, ఎజెండాలను పక్కనపెట్టి సమైక్యాంధ్ర కోసం ఉద్యమించాలని పిలుపునిచ్చారు.
నాయకులు ఒకరిపై ఒకరు బురద జల్లుకోకుండా ఐక్యంగా ఉండి టీ బిల్లుకు వ్యతిరేకంగా పోరాడాలన్నారు. టీ బిల్లు అసెంబ్లీకి చేరిన నాటినుంచి ప్రతి ఎమ్మెల్యే వ్యవహారశైలిని ప్రజలంతా గమనిస్తున్నారన్నారు. ఏఒక్కరు ఉద్యమంలోకి రాకపోయినా భవిష్యత్లో ప్రజలు వారికి తగిన గుణపాఠం చెప్పకతప్పదన్నారు. కాంగ్రెస్ వ్యవహారాల రాష్ట్ర ఇన్చార్జి దిగ్విజయ్సింగ్ వ చ్చి సీమాంధ్ర నేతలను బుజ్జగించి వెళ్లారని, ఈ బుజ్జగింపులకు కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ఎట్టిపరిస్థితుల్లోనూ లొంగకూడదన్నారు. వేదిక చైర్మన్ హనుమంతు సాయిరాం మాట్లాడుతూ సీమాంధ్ర ఎమ్మెల్యేలు అధిష్టానం ఒత్తిడికి లొంగి సమైక్యాంధ్రకు ద్రోహం చేస్తున్నారని విమర్శించారు. సమైక్యాంధ్ర పరిరక్షణ వేదిక జెడ్పీ కన్వీనర్ కె.నారాయణరావు మాట్లాడుతూ తుపాన్ను అడ్డుకోలేకపోయినప్పటికీ రాష్ట్ర విభజనను అడ్డుకుంటామని ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి చెప్పారని, తీరా టీ బిల్లు అసెంబ్లీకి వచ్చే నాటికి ఆయనతోపాటు ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు కూడా లేకపోవడం శోచనీయమన్నారు.
విభజన జరగకముందే హైదరాబాద్లో రౌడీయిజం పెరిగిపోయిందని ఆందోళన వ్యక్తం చేశార. వేదిక ప్రతినిధి ప్రొఫెసర్ డి.విష్ణుమూర్తి మాట్లాడుతూ విభజన వల్ల సీమాంధ్ర తీవ్రంగా నష్టపోతోందని తెలిసి కూడా అన్ని పార్టీల నాయకులు ఎందుకు ఐకమత్యం కాలేకపోతున్నారో అర్థం కావడం లేదన్నారు. కార్యక్రమానికి ముందుగా వైఎస్ఆర్ కూడలి వద్ద నుంచి సమైక్యవాదులంతా పాలకొండ రోడ్డు, డే అండ్ నైట్ కూడలి, రామలక్ష్మణ, సూర్యమహల్,అరసవల్లి మీదుగా పొట్టిశ్రీరాములు జంక్షన్ వరకూ బైక్ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో పరిరక్షణ వేదిక ప్రతినిధులు బమ్మిడి నర్సింగరావు, బెండి జనార్దనరావు, పి.జయరాం, ఎం.ఆర్.కె.దాస్, పూజారి జానకిరాం, ఆర్.వేణుగోపాల్, శోభారాణి, విజయ్కుమార్, శ్రీనివాసరావు, వై.ఉమామహేశ్వరరావు, గొలివి నర్సునాయుడు, పి.రవీంద్రకుమార్, అధిక సంఖ్యలో ఎన్జీవో ఉద్యోగులు పాల్గొన్నారు.