తమ్ముళ్ల దౌర్జన్యం! | TDP leaders maintaining as thier wish | Sakshi
Sakshi News home page

తమ్ముళ్ల దౌర్జన్యం!

Jan 6 2014 4:16 AM | Updated on Aug 10 2018 9:40 PM

ధర్మవరం నియోజకవర్గంలోని అన్ని శాఖల అధికారులపై టీడీపీ నాయకులు రౌడీయిజాన్ని ప్రదర్శిస్తున్నారు.

ధర్మవరం, న్యూస్‌లైన్ : ధర్మవరం నియోజకవర్గంలోని అన్ని శాఖల అధికారులపై టీడీపీ నాయకులు రౌడీయిజాన్ని ప్రదర్శిస్తున్నారు. తమ మాట వినలేదంటూ రెవెన్యూ, పంచాయతీరాజ్, మండల పరిషత్, పోలీసు తదితర శాఖల అధికారులపై బెదిరింపులకు దిగుతున్నారు. ముఖ్యంగా ఆ పార్టీ నాయకుడు చీటికి మాటికి అధికారులపై నోరు పారేసుకుంటున్నారు. తాము అధికారంలోకి వస్తే ఇప్పుడు పనిచేసిన అధికారులందరిపై విచారణకు ఆదేశిస్తామంటూ బెదిరింపులకు దిగుతున్నారు. తమ మాట వినని పోలీసు అధికారులపై ప్రతి చిన్న విషయానికి ప్రైవేటు కేసులు పెడుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నారు.
 
 ఇతర శాఖ అధికారులనైతే వారి కార్యాలయాల్లోనే దిగువస్థాయి సిబ్బంది ముందే నోటికొచ్చినట్లు తిడుతున్నారు. ముఖ్యంగా కొంత మంది బలహీన వర్గాలకు చెందిన అధికారులపై ఆయన చూపుతున్న ప్రతాపం అంతా ఇంతా కాదు. స్టోర్ డీలర్‌షిప్‌లు, పంచాయతీ అభివృద్ధి పనులు, ఉపాధి పనులు తదితర వాటిని తన అనుయాయులకు ఇవ్వాలంటూ హుకుం జారీ చేస్తున్నారు.
 
 తన సామాజిక వర్గానికి చెందిన అధికారులను మాత్రం పల్లెత్తు మాట అనడం లేదు. పైగా వారిని వెనకేసుకొస్తున్నారు. ఇక గట్టిగా మాట్లాడే అధికారులపై ఉన్నతాధికారులకు పదే పదే ఫిర్యాదు చేస్తూ వారిని తీవ్ర మనోవేదనకు గురిచేస్తున్నారు. దీంతో అధికారులు విధులకు హాజరు కావాలంటేనే భయపడే పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో వారు బదిలీపై వెళ్లడానికి ప్రయత్నిస్తున్నారు. మరికొందరు దీర్ఘకాలిక సెలవు పెట్టే యోచనలో ఉన్నట్లు సమాచారం.
 
 బెదిరింపుల పర్వం ఇలా...
  ధర్మవరం డివిజన్ స్థాయి అధికారిని ఏకంగా విలేకరుల సమావేశంలోనే కులం పేరుతో తిట్టారు. ఆయన్ను బదిలీ చేయకపోతే కార్యాలయం ఎదుటే ఆమరణ దీక్ష చేస్తామంటూ బెదిరిస్తున్నారు.
 
  ఓ మండల స్థాయి అధికారికి ఫోన్ చేసి ‘మేమే అధికారంలోకి వచ్చేది. మిమ్మల్ని శంకరగిరి మన్యాలు పట్టిస్తామ’ని బెదిరించారు.  బత్తలపల్లి మండలంలో ఓ అధికారి తన వారికి పనులు చేసిపెట్టలేదన్న కారణంతో ఆయనపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ బెదిరింపులకు దిగారు.  టీడీపీ వారికి చెందిన దొంగ ఓట్లు తొలగించారన్న నెపంతో బీఎల్‌ఓలపై కలెక్టర్‌కు ఫిర్యాదులు చేశారు.
 
  నిత్యావసర సరుకుల పంపిణీలో అక్రమాలకు పాల్పడుతున్నట్లు విజిలెన్స్ తనిఖీల్లో గుర్తించిన స్టోర్ డీలర్లను అధికారులు తొలగించారు. అయితే... వారికి తిరిగి డీలర్‌షిప్‌లు కట్టబెట్టాలంటూ సదరు టీడీపీ నేత అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. వారు మాట వినకపోవడంతో అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేశారు.
 
  పంచాయతీ ఎన్నికల్లో ఉపాధి హామీ సిబ్బంది అనుకూలంగా వ్యవహరించలేదనే సాకుతో వారందరినీ వెంటనే తొలగించాలంటూ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. అధికారులు సదరు సిబ్బందిని విచారిస్తే ఎటువంటి అక్రమాలూ జరగలేదని తేలింది.  గ్రామాల్లో చిన్నచిన్న ఘటనలకు పెద్ద సెక్షన్ల కింద కేసులు పెట్టాలని పోలీసు అధికారులపై ఒత్తిడి తెచ్చారు. అందుకు వారు అంగీకరించకపోవడంతో ప్రైవేటు కేసులు వేసి వేధిస్తున్నారు.  నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న తన వా హనాలకు జరిమానా విధించారన్న ఉద్దేశంతో ఓ అధికారిపై ఉన్నతాధికారులకు  ఫిర్యాదు చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement