అధికారం ఉందిగా...

TDP Government Gives Land For TDP Party Office Building With Cheap Cost - Sakshi

తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి ఎకరా స్థలం

కారు చౌకగా 33 ఏళ్ల లీజుకు మంత్రివర్గం ఆమోదం

ప్రస్తుతం మార్కెట్‌ విలువ రూ. 4.8కోట్లకు పైమాటే...

కేవలం ఏడాదికి రూ. వెయ్యి అద్దె నిర్ధారణ

నిలువ నీడలేని ఎందరో నిరుపేదలు నేడు గూడుకోసం కనీస స్థలం ఇవ్వాలని వేడుకుంటున్నారు. ప్రతి సోమవారం నిర్వహించే గ్రీవెన్స్‌సెల్‌కు కుప్పలు తెప్పలుగా దరఖాస్తులు అందజేస్తున్నారు. వారికి సెంటు స్థలాన్ని ఇవ్వడానికి చొరవ చూపని సర్కారు... పార్టీ కార్యాలయానికి విలువైన స్థలాన్ని లీజు పేరుతో కట్టబెట్టేందుకు ఆమోదముద్ర వేసింది. జాతీయ రహదారికి కూతవేటు దూరంలో... విలువైన స్థలాన్ని ఏరికోరి అప్పగించేందుకు స్కెచ్‌ వేసింది.

సాక్షిప్రతినిధి, విజయనగరం : రాష్ట్రంలో ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కనీసం ఒక్కరంటే ఒక్కరికి కూడా సెంటు స్థలమైనా ఇచ్చింది లేదు. చాలీ చాలని సంపాదనలో అద్దెలు చెల్లించుకోలేక సొంత గూడు కట్టుకుందామంటే సొంత జాగాలేక సతమతమవుతున్నవారు ఎందరో ఉన్నారు. అలాంటివారు సొంత ఇల్లు మంజూరు చేయమని అడిగితే పాలకులు, అధికారులు స్పందించరు. కనీసం సమాధానం కూడా చెప్పలేదు. అధికారపార్టీ కోసం అడిగిందే తడవుగా కోట్ల రూపాయల విలువైన భూమిని ధారాదత్తం చేసేస్తున్నారు. విజయనగరం మండలం కనపాక రెవెన్యూ పరిధిలో ఎకరా భూమిని తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయ నిర్మాణం కోసం ప్రభుత్వం కట్ట బెడుతోంది.

ఈ మేరకు మంత్రివర్గ సమావేశంలో ఆమోదం లభిం చింది. 16వ నంబర్‌ జాతీయ రహదారికి కేవలం పావు కిలోమీటరు దూరంలో ఉన్న ఈ భూమికి ప్రభుత్వ నిర్ధారించిన విలువ రూ.2.16 కోట్లు. బహిరంగ మార్కెట్‌లో ఈ భూమి విలువ రూ.4.8 కోట్లు పైనే పలుకుతోంది. ఇంత ఖరీదైన స్థలాన్ని ఏడాదికి కేవలం రూ.1000ల లీజు చెల్లించి, 33 ఏళ్ల పాటు అప్పనంగా వాడుకోమని ఇచ్చేస్తోంది. పేద ప్రజలు సొంత ఇంటి కోసం కాళ్లరిగేలా తిరుగుతున్నా, కనీసం కనికరం చూపని టీడీపీ ప్రభుత్వం తన స్వప్రయోజనాల కోసం ఎకరాల కెకరాలు కొల్లగొట్టేస్తోంది.

రాజుగారి కోట దాటిరావాలనేనా...
జిల్లా టీడీపీకి కార్యాలయం అంటూ ప్రత్యేకంగా లేకపోవడం వల్ల కేంద్ర మాజీ మంత్రి అశోక్‌గజపతిరాజు బంగ్లా నే పార్టీ కార్యాలయంగా వినియోగిస్తున్నారు. ఈ బంగ్లాకు రావడానికి కొంతమంది నేతలు అయిష్టంగానే ఉంటున్నా రు. జిల్లాకు చెందిన మంత్రి సుజయ్‌ కూడా అశోక్‌ బంగ్లా కు రావడం లేదు. అలాగే పార్టీ కార్యక్రమాలు జరిగినా, సీఎం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించినా బంగ్లాకు రావడానికి కొంతమంది ఎమ్మెల్యేలు, నాయకులు ఇబ్బంది పడుతున్నారు. ఏదో ఒక కారణం చెప్పి రాకుండా తప్పించుకుంటున్నారు.

ఇక జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి గంటా అయితే జిల్లా పార్టీ సమీక్షలను అమరావతి, విశాఖపట్నంలోనే నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాపార్టీకి కార్యాల యం ఉండాలని భావించి స్థలం ఇప్పించాల్సిందిగా 2015–16లో పార్టీ నేతలు ప్రభుత్వానికి దరఖాస్తు చేశా రు. పార్టీ నేతల విజ్ఞప్తిని పరిశీలించిన జిల్లా జాయింట్‌ కలెక్టర్, ఆర్డీఓ, తహసీల్దార్లు వెంటనే ప్రతిపాదనలు పంపిం చారు. తొలుత అయ్యన్నపేటలో స్థలాన్ని చూశారు. కానీ పట్టణానికి మరింత దగ్గరగా ఉండాలని టీడీపీ నేతలు పట్టుబట్టడంతో కనపాక రెవెన్యూలో యూత్‌ హాస్టల్‌ ఎదురుగా సర్వే నంబర్‌ 15/1లో ఉన్న ఎకరా ఖాళీ స్థలాన్ని ఇచ్చేందుకు రంగం సిద్ధం చేశారు.

నిజానికి ఈ ప్రాంతంలో 1985లోనే ఉందరికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. కానీ వారంతా పేదవారు కావడంతో ఇల్లు కట్టుకోలేకపోయారు. వా రికి ఆర్థిక చేయూతనిచ్చి గూడు కల్పించాల్సిందిపోయి వారి నుంచి లాక్కొని పార్టీ కార్యాలయం కట్టా లనుకుంటున్నారు. దీని కోసం పట్టణానికి చెందిన టీడీపీ నేత ఒక రు చక్రం తిప్పి జనాన్ని ఒప్పించా రు. అధికారం వారిదే కాబట్టి మంత్రి మండలి మారు మాట్లాడకుండా ఆమోదం ఇచ్చేసింది.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top